హైదరాబాద్, అక్టోబర్ 3 (నమస్తే తెలంగాణ): తెలంగాణకు అనేక జాతీయ అవార్డులు రావడం రాష్ట్ర ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు చెప్పారు. నిధుల విడుదలలో కేంద్రం వివక్ష చూపుతున్నప్పటికీ.. అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ.. దేశంలోనే నంబర్ వన్గా ఉన్నదని, దీనిపై బహిరంగ చర్చకు సిద్ధమని బీజేపీ నేతలకు సవాల్ విసిరారు. స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్లో రాష్ర్టానికి మొద టి ర్యాంకుతోపాటు వివిధ జిల్లాలకు, మిషన్ భగీరథకు జాతీయ అవార్డులు లభించిన నేపథ్యంలో సోమవారం ఆయన పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా, డైరెక్టర్ హనుమంతరావు, మిషన్ భగీరథ ఈఎన్సీ కృపాకర్రెడ్డి, వివిధ జిల్లాల కలెక్టర్లు, అధికారులను సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వ పనితీరును గుర్తించి, అవార్డులు ఇచ్చినందుకు కేంద్రానికి ధన్యవాదాలు తెలిపారు. సీఎం కేసీఆర్ ముందుచూపు, ప్రణాళిక ద్వారానే రాష్ర్టానికి అవార్డులు వస్తున్నాయని చెప్పా రు. ఇంటింటికీ నల్లా నీటిని అందించే మిషన్ భగీరథను అభినందిస్తూ కేంద్రం పార్లమెంట్లో లిఖితపూర్వక సమాధానాలు ఇచ్చిందని గుర్తుచేశారు. కేంద్రం రాష్ర్టానికి ప్రకటించిన అవార్డుపై వక్రభాష్యాలతో తప్పుడు ప్రచారం చేస్తున్నారని అభ్యంతరం వ్యక్తంచేశారు. ఢిల్లీ బీజేపీ నేతలది ఒక మాట, గల్లీ బీజేపీ నేతలది మరోమాటగా ఉన్నదని ఎద్దేవా చేశారు. మోదీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గుజరాత్లో 50% ఇండ్లకే నీరు ఇచ్చారని గుర్తుచేశారు. గుజరాత్, ఉత్తరప్రదేశ్లో ఇంటింటికీ నల్లా కార్యక్రమానికి కేంద్రం నిధులు ఇచ్చిందని తెలిపారు. తెలంగాణలో 100% అంటే 54 లక్షల గృహాలకు తాగు నీటిని సరఫరా చేస్తున్నదని కేంద్ర జలవనరులశాఖ చేసిన ట్వీట్తోపాటు రాజ్యసభలో మిషన్ భగీరథను కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ అభినందించిన వీడియోను ప్రదర్శించారు. ఫ్లోరైడ్ మహమ్మారిని తరిమేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని పార్లమెంట్లో చెప్పారని గుర్తుచేశారు.గ్రామాలకు ప్రతి నెలా ఇచ్చే నిధులను ఈ సంవత్సరం కేంద్రం రూ.350 కోట్ల నుంచి రూ.230 కోట్లకు తగ్గించిందని విమర్శించారు. కేంద్రం ఎన్ని నిధులు ఇస్తే.. అదనంగా అంత మొత్తం రాష్ట్రం కూడా ఇస్తున్నదని వివరించారు.
త్వరలో ఆసరా పెన్షన్లకు దరఖాస్తులు
ఆసరా పెన్షన్లకు ఇంకా ఎవరైనా అర్హులు ఉంటే.. వారు దరఖాస్తు చేసుకోవడానికి త్వరలో అవకాశం ఇస్తామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు తెలిపారు. ఇప్పటికే కొత్తగా 9.65 లక్షల మంది అర్హులకు ఆసరా పెన్షన్లు మంజూరయ్యాయని చెప్పారు. మరో 2-3 లక్షల మంది అర్హులు ఉంటారని భావిస్తున్నామని పేర్కొన్నారు. వీరి నుంచి రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే దరఖాస్తులు స్వీకరిస్తుందని వెల్లడించారు.