హన్మకొండ : ఉమ్మడి వరంగల్ జిల్లాలో దాదాపు 9 లక్షల హెక్టార్లలో ప్రత్తి సాగు చేయబడుతున్నదని, అందువల్ల రైతులు పండించిన ప్రత్తికి అధిక ధర వచ్చే విధంగా చూడాని కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అధికారులను మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కోరారు. హన్మకొండలోని ఆర్ అండ్ బీ అతిధి గృహంలో బుధవారం నాడు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా డిప్యూటీ జనరల్ మేనేజర్ అమరనాథ్ రెడ్డి, మార్కెటింగ్ మేనేజర్ ప్రవీణ్ కుమార్, ఇతర అధికారులు మంత్రిని కలిశారు. ఈ సందర్భంగా ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో ప్రత్తి క్వింటాల్కు కనీస మద్దతు ధర రూ. 6,025 గా నిర్ణయించిందన్నారు. నిర్ణయించిన మద్దతు ధర కన్నా ఎక్కువ ధరకు రైతుల నుండి ప్రత్తి కొనుగోలు చేసే విధంగా చూడాలని అయన అధికారులను కోరారు.
వరంగల్లో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కార్యాలయ వసతి కోసం రాష్ట్ర ప్రభుత్వం భవనాన్ని కేటాయిస్తామని ఈ సందర్బంగా సీసీఐ అధికారులకు మంత్రి హామీ ఇచ్చారు. సీసీఐ వరంగల్, ఆదిలాబాద్, మహబూబ్ నగర్ బ్రాంచీల ద్వారా గత ఆర్ధిక సంవత్సరంలో 29 జిల్లాలలోని 112 కేంద్రాల ద్వారా 7 లక్షల 99 వేల 340 మంది రైతుల నుండి 1 కోటి 78 లక్షల 90 వేల 264 క్వింటాళ్ల ప్రత్తిని సేకరించినట్లు సీసీఐ డిప్యూటీ జనరల్ మేనేజర్ అమరనాథ్ రెడ్డి ఈ సందర్బంగా తెలిపారు. సీసీఐ కార్యాలయానికి రాష్ట్ర ప్రభుత్వ భవనాన్ని కేటాయించినందుకు మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.