హైదరాబాద్ : అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా రాష్ర్టంలోని నర్సులందరికీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు శుభాకాంక్షలు తెలిపారు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్నప్పటికీ నర్సులు నిస్వార్థంతో నిరంతరం సేవలు అందిస్తున్నారని మంత్రి కొనియాడారు. నర్సుల సేవలు, త్యాగం మరువలేనిదని, రోగులను ఎంతో సహనంతో, తల్లిలా చూసుకుంటున్నారని మంత్రి వెల్లడించారు. కోరానా బాధితులను కాపాడుకునేందుకు తమ ప్రాణాలను ఫణంగా పెడుతున్నారని ఆయన అన్నారు. వైద్య మౌళిక సదుపాయాలకు వెన్నముకగా ఉన్నందుకు నర్సులందరికి ఎంతో రుణపడి ఉన్నామని మంత్రి అన్నారు. రోగులకు వైద్యులు ఇచ్చే ఔషధం ఎంత ముఖ్యమో నర్సులు చేసే సేవ కూడా అంతే ముఖ్యమన్నారు.
నర్సు వృత్తికి మార్గదర్శకమైన ఫ్లోరెన్స్ నైటింగేల్ 1854 లో యుద్దములో టర్కీలో గాయపడిన సైనికులకు చేసిన సేవకు గుర్తుగా ఆమె జన్మదినమైన మే 12వ తేదీని అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని జరుపుతున్నారని మంత్రి తెలిపారు. వెలకట్టలేని నర్సుల సేవలకు గుర్తుగా అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా వారి సేవలను స్మరించుకోవడం మనం వారికిచ్చే గౌరవమని మంత్రి దయాకర్రావు అన్నారు.