వరంగల్ : మేడారం జనసంద్రమైంది. గిరిజన దేవతలైన సమ్మక్క-సారక్క వనం వీడి గద్దెలపైకి చేరగా.. అశేష జనవాహిని తరలివచ్చి మొక్కులు చెల్లిస్తున్నది. రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు సైతం నిలువెత్తు బంగారం సమర్పించి మొక్కులు చెల్లించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గద్దెలపైకి అమ్మవార్లు చేరక ముందే 75లక్షల మంది దర్శించుకున్నారన్నారు.
డిసెంబర్ నుంచి జాతర ప్రారంభానికి ముందు వరకు 50లక్షల మంది భక్తులు దర్శనం చేసుకున్నారని చెప్పారు. కుంభమేళా తర్వాత జరిగే అతిపెద్ద జాతర అయిన మేడారం జాతరకు జాతీయ హోదా కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. జాతరలో గద్దెపైకి సారక్క రాక ముందే 50లక్షల మంది దర్శించకున్నారని, జాతర ప్రారంభం అయ్యాక 75లక్షల మంది భక్తులు మొక్కులు చెల్లించారన్నారు. భారీగా పోలీసులను మోహరించి బందోబస్తు కల్పించినట్లు తెలిపారు.
వనదేవతలను దర్శించుకునేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం మేడారానికి వస్తున్నారని మంత్రి ఎర్రబెల్లి తెలిపారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా జాతర ఏర్పాట్లు, భక్తుల రాకను హెలికాప్టర్ ద్వారా పరిశీలించారు. జాతర ఏర్పాట్లను మంత్రి 50 కిలోమీటర్ల మేర వీక్షించారు. గ్రామీణ నీటి సరఫరా ద్వారా జాతర కోసం తమ శాఖ ద్వారా రూ.10కోట్లు వెచ్చిస్తున్నామని, మేడారం వచ్చే యాత్రికుల ప్రయోజనం కోసం శాశ్వత ఏర్పాట్లు చేయడానికి ప్రయత్నిస్తున్నామని తెలిపారు. కలెక్టర్ కృష్ణ ఆదిత్య, ఇతర అధికారులతోనూ మాట్లాడారు. ఈ పర్యటనలో మంత్రి సతీమణి, ఎర్రబెల్లి ఛారిటబుల్ ట్రస్ట్ చైర్పర్సన్ ఉషాదయాకర్రావు ఆయన వెంట ఉన్నారు.