హైదరాబాద్ : తెలంగాణలోనే దేవాలయాలకు పూర్వ వైభవం వస్తుందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. వరంగల్ జిల్లా రాయపర్తి మండలం ఊకల్ గ్రామంలో కంఠ మహేశ్వర స్వామి ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పంచాయతీ కార్యాలయం వద్ద మంత్రి బోనం ఎత్తుకొని.. కాటమయ్య గుడి వరకు గ్రామస్తులతో కలిసి నడిచారు.
అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ధూప దీప నైవేద్యాలకు కూడా ప్రభుత్వం సాయంగా ఉందని, గ్రామ దేవతలకు పెట్టింది పేరు తెలంగాణ అన్నారు. ఊకల్ గ్రామంలో జరిగిన వేడుకల్లో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. గ్రామకంఠ మహేశ్వర స్వామి గుడి దారి కోసం రూ.20 లక్షలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. గ్రామ అభివృద్ధికి మరింత సహకరిస్తానన్నారు.