ములుగు : పేదల సంక్షేమానికి పాటుపడిన వీరపనేని శివాజీ ఆశయ సాధనకు కృషి చేస్తానని రాష్ట్ర పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పేర్కొన్నారు. జిల్లాలోని గోవిందరావుపేటలో వీరపనేని శివాజీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి రావడం సంతోషంగా ఉందన్నారు. 1982 నుంచి శివాజీ ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేశారన్నారు. స్వరాష్ట్రంలో అప్పటి ముఖ్యమంత్రిని ఎన్టీఆర్ను ఒప్పించి, నిర్మించారన్నారు. గోవిందరావుపేటను మండలంగా చేయించారన్నారు.
నా రాజకీయ జీవితంలో ఇద్దరు ముఖ్యమంత్రులను అభిమానిస్తానని మంత్రి పేర్కొన్నారు. ఇందులో ఒకరు ఎన్టీఆర్ అయితే.. మరొకరు సీఎం కేసీఆర్ అన్నారు. పెన్షన్, రెండు కిలోల బియ్యం ఇచ్చి పేదల సంక్షేమానికి ఎన్టీఆర్ కృషి చేశారని, ఎన్టీఆర్ గోవిందరావుపేటను మండలంగా చేస్తే.. సీఎం కేసీఆర్ ములుగును జిల్లాగా మార్చడంతో పాటు సమగ్రాభివృద్ధి చేపట్టారన్నారు. ములుగుకు రూ.550కోట్లతో 300 పడకల మెడికల్ ఆసుపత్రిని నిర్మించారన్నారు. శివాజీ స్ఫూర్తితో గ్రామాభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.
తనవంతుగా గ్రామంలో సీసీరోడ్లు వేయిస్తానన్నారు. కార్యక్రమంలో ఎంపీ మాలోతు కవిత, రెడ్కో చైర్మన్ సతీశ్ రెడ్డి, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మాజీ ఎంపీ సీతారాం నాయక్, కలెక్టర్ కృష్ణ ఆదిత్య, టీఆర్ఎస్ జిల్లా నాయకులు గోవింద్ నాయక్, తుమ్మల హరిబాబు, సూడి శ్రీనివాస్ రెడ్డి, ఎంపీటీసీ ఆలూరి శ్రీనివాస రావు, సర్పంచ్ లావుడ్య లక్ష్మి జోగా నాయక్, కుటుంబ సభ్యులు రామకృష్ణ, రవికాంత్, సునీత(సింగర్), సుధారాణి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వీరపనేని శివాజీ జీవన ప్రస్థానం పుస్తకం, పాటల సీడీని ఆవిష్కరించారు.