హైదరాబాద్ : కేంద్రం మెడలు వంచి వడ్లు కొనుగోలు చేసేలా చేద్దామని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్ పిలుపు మేరకు యాసంగి వడ్లు కొనాలని డిమాండ్ చేస్తూ జనగామ జిల్లా కేంద్రంలో భారీ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు, పార్టీ నేతలు కేంద్రానికి వ్యతిరేకంగా నినదించారు. వెంటనే కేంద్రం దిగివచ్చిన వడ్లు కొనుగోలు చేయాలని, అప్పటి వరకు ఉద్యమాన్ని ఆపేది లేదని స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ను తిప్పలు పెట్టాలని కేంద్రం కంకణం కట్టుకుందని ఆరోపించారు. కేంద్రంలోని బీజేపీ వరి వేయొద్దని చెప్పిందని, రాష్ట్రంలో రైతులు వరిని తగ్గించి వేస్తుంటే బండి సంజయ్, కేంద్రమంత్రి కిషన్రెడ్డి వరి వేయాలని రెచ్చగొట్టారన్నారు. కేంద్రమంత్రి తెలంగాణ ప్రజలకు నూకలు తినిపించాలని అంటూ అవమానించారన్నారు. అవమానించిన జూటా బీజేపీ నేతలకు తగిన గుణపాఠం చెప్పాలన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలతో సాగు విస్తీర్ణం పెరగడంతో.. దిగుబడులు పెరిగాయని.. ఇప్పుడు ధాన్యం కొనమంటే కేంద్రం చేతులెత్తేసిందని మండిపడ్డారు. కేంద్రం తెచ్చిన రైతు చట్టాలు, విద్యుత్ చట్టాన్ని సీఎం కేసీఆర్ వ్యతిరేకించారని, అందుకే కేంద్రం కక్షగట్టిందని ఆరోపించారు.
తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పి.. దిగివచ్చి వడ్లు కొనేదాకా ఉద్యమం ఆపేది లేదన్నారు. తెలంగాణ ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్కు రైతులంతా వెన్నుదన్నుగా నిలువాలన్నారు. శుక్రవారం కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మలను దహనం చేయాలని, బీజేపీ ప్రభుత్వాన్ని గంగలో కలుపాలన్నారు. ప్రతి రైతు ఇంటిపై నల్లజెండాలు ఎగుర వేసి.. నిరసనతో ఢిల్లీ పీఠాన్ని వణికించాలన్నారు. కార్యక్రమంలో జనగామ జడ్పీ చైర్మన్ పాగాల సంపత్ రెడ్డి, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యేలు తాటికొండ రాజయ్య, ముత్తి రెడ్డి యాదగిరి రెడ్డి, మాజీ ఎంపీ, ఎమ్మెల్సీ బోడకుంటి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.