హైదరాబాద్ : రాష్ట్రానికి చెందిన ఇద్దరు ఐపీఎస్లు రాష్ట్రపతి పోలీస్ పతకాలకు ఎంపికయ్యారు. రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ మురళీధర్ భగవత్, కౌంటర్ ఇంటెలిజెన్స్ ఎస్పీ దేవేంద్ర సింగ్ రాష్ట్రపతి పోలీస్ పతకాలను అందుకోనున్నారు. స్వాంతంత్ర్య దినోత్సవం సందర్భంగా పోలీస్లకు కేంద్రహోంశాఖ అవార్డులను అందజేయడం ఆనవాయితీగా వస్తున్నది.
ఈ ఏడాది సైతం అవార్డులను ప్రదానం చేయనుండగా.. 215 మందికి పోలీస్ మెడల్ గ్యాలంటరీ (PMG), ప్రెసిడెంట్ పోలీస్ మెడల్ (PPM) 87 మంది, 648 మందికి విశిష్ట సేవ పోలీస్ పతకాలను కేంద్ర హోంశాఖ ప్రకటించింది. ఇందులో రాష్ట్రం నుంచి రాష్ట్రపతి పోలీస్ పతకాలకు ఇద్దరు ఐపీఎస్లు, మరో 12 మంది అధికారులు ఇండియన్ పోలీస్ మెడల్స్కు ఎంపికయ్యారు.
కేంద్ర పోలీసు పతకాలు సాధించిన వారిలో ట్రాఫిక్ ఐజీ ఏఆర్ శ్రీనివాస్, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ అడిషనల్ ఎస్పీ పాలేరు సత్యనారాయణ, ఎస్ఐబీ అడిషనల్ ఎస్పీ పైళ్ల శ్రీనివాస్, హైదరాబాద్ సెంట్రల్ జోన్ డీఎస్పీ ఎస్ వెంకటరమణ మూర్తి, ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ డీఎస్పీ చెరుకు వాసుదేవ రెడ్డి, టీఎస్ పోలీస్ అకాడమీ డీఎస్పీ గంగిశెట్టి గురు రాఘవేంద్ర, రామగుండం ఎస్సై(సీఎస్బీ) చిప్పా రాజమౌలి, చౌటుప్పల్ ఏఎస్సై కాట్రగడ్డ శ్రీనివాస్ ఉన్నారు.