నిజామాబాద్ : మెట్రాజ్పల్లి పంప్ హౌస్ పనులు చివరి దశకి చేరుకున్నాయని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. దేశంలోనే అత్యున్నత టెక్నాలజీతో ప్యాకేజీ 21 నిర్మాణం అవుతోందని కవిత పేర్కొన్నారు. రైతుల భూములు పోకుండా భూగర్భం నుంచే పైప్ లైన్స్ వెళ్తాయని స్పష్టం చేశారు. ప్యాకేజీ 21 తో 2 లక్షల ఎకరాలకు సాగు నీరు అందుతుందని ఎమ్మెల్సీ పేర్కొన్నారు. కరోనా నపథ్యంలో అందరూ అప్రమత్తంగా ఉండాలని ఆమె సూచించారు. అలాగే నిజామాబాద్లో కరోనా మూడో వేవ్ని ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉన్నామన్నారు.
రాష్ట్రంలో మూడో వేవ్ రాదనే అనుకుంటున్నామని ఆమె అభిప్రాయపడ్డారు. అయినా కూడా ముందస్తు జాగ్రత్తలు తీసుకుని వైద్య సదుపాయాలు సిద్ధం చేస్తున్నామని కవిత తెలిపారు. ఎమ్మెల్సీ వెంట ఎమ్మెల్యే బాజి రెడ్డి గోవర్ధన్, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు ఉన్నారు.