హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 29 (నమస్తే తెలంగాణ): శంషాబాద్ విమానాశ్రయ ప్రయాణికులకు ప్రపంచ స్థాయి ప్రమాణాలతో మెట్రో రైల్ సేవలను అందించాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించుకున్నట్టు హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. ఈ లక్ష్యానికి అనుగుణంగా ఎయిర్పోర్టు మెట్రో ఎక్స్ప్రెస్ కారిడార్ ప్రాజెక్టును డిజైన్ చేస్తున్నామని చెప్పారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్లే ప్రయాణికులకు రాయదుర్గం మెట్రో స్టేషన్లోనే లగేజ్ చెక్ ఇన్ సదుపాయం అందుబాటులోకి వస్తుందని, మళ్లీ ఎయిర్పోర్టులో ఎలాంటి తనిఖీలు ఉండబోవని వెల్లడించారు. హైదరాబాద్లో మెట్రో రైల్ సేవలు ప్రారంభమై ఐదేండ్లు పూర్తయిన సందర్భంగా మంగళవారం అమీర్పేట మెట్రో స్టేషన్లో ఘనంగా ఉత్సవాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎన్వీఎస్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఎయిర్పోర్టు మెట్రో ఎక్స్ప్రెస్ కారిడార్ ప్రాజెక్టు అందుబాటులోకి వచ్చాక శంషాబాద్ విమానాశ్రయానికి తొలుత 10 మెట్రో రైళ్లను ప్రారంభిస్తామని, వీటిని ప్రతి 8 నిమిషాలకు ఒకటి చొప్పున నడుపుతామని వివరించారు. ఈ రైళ్లలో విమానాశ్రయానికి వెళ్లేవారు నేరుగా తమతమ గేట్ల వద్దకు చేరుకోవచ్చని, లగేజీని తీసుకెళ్లేందుకు ఈ రైలు బోగీల్లో కావల్సినంత స్థలం ఉంటుందని తెలిపారు. హైదరాబాద్ మెట్రో రైల్ తొలి దశలో మాదిరిగా కాకుండా రెండో దశలో ఎలివేటెడ్ ట్రాక్తోపాటు గ్రేడ్ లెవల్, అండర్గ్రౌండ్ ట్రాక్లు కూడా ఉంటాయన్నారు. మొత్తం 31 కి.మీ. పొడవైన ఈ కారిడార్లో 26.365 కి.మీ. ఎలివేటెడ్ ట్రాక్, 2.630 నుంచి 2.635 కి.మీ. అండర్గ్రౌండ్ ట్రాక్, 0.840 కి.మీ. గ్రేడ్ లెవల్ ట్రాక్ ఉంటాయని వివరించారు. కార్యక్రమంలో ఎల్అండ్టీ మెట్రో రైల్ (హైదరాబాద్) లిమిటెడ్ ఎండీ, సీఈవో కేవీబీ రెడ్డి, ఎల్అండ్టీఎంఆర్హెచ్ఎల్, హెచ్ఎంఆర్ఎల్, కియోలిస్, ఫోన్పే అధికారులు పాల్గొన్నారు. ఈ ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన జానపద నృత్యాలు, సంగీత కార్యక్రమాలు అందరినీ అలరించాయి. అనంతరం హైదరాబాద్ మెట్రో రైల్ సేవలను తరచుగా వినియోగించుకొంటున్నవారిలో 15 మంది విశిష్ట కస్టమర్లను సత్కరించి ఒక్కొక్కరికి రూ.10 వేల విలువైన వోచర్ను బహూకరించారు.