హైదరాబాద్, సెప్టెంబర్ 6 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా జిల్లాకు ఒక మానసిక ఆరోగ్య కేంద్రాన్ని (మెంటల్ హెల్త్ సెంటర్) ఏర్పాటు చేయాలని వైద్యారోగ్యశాఖ నిర్ణయించింది. మహిళలు, పిల్లలకు సేవలందించేందుకు వీటిని ప్రత్యేకంగా ఏర్పాటు చేయనున్నారు. ఒక్కో కేంద్రంలో ఒక మానసిక వైద్యుడు, గైనకాలజిస్ట్, అసిస్టెంట్ డాక్టర్, ఇద్దరు స్టాఫ్నర్సులు, సహాయక సిబ్బంది ఉంటారని సమాచారం. వీరు గర్భిణులకు, పిల్లలకు నేరుగా లేదా ఆన్లైన్లో కౌన్సెలింగ్ ఇస్తారు. తొలిసారి గర్భందాల్చిన మహిళలల్లో కొందరికి వివిధ కారణాల వల్ల మానసిక సమస్యలు తలెత్తుతాయి. మానసిక ఒత్తిడి ఎక్కువైతే అబార్షన్ లేదా, డెలివరీ సమయంలో ఇబ్బందులు ఎదరయ్యే ప్రమాదం ఉంటుం ది. ఇటువంటివారికి ప్రత్యేకంగా కౌన్సెలింగ్ ఇస్తారు. జిల్లాల్లో మెంటల్ హెల్త్ సెంటర్లతోపాటు రాష్ట్రస్థాయిలో కమాండ్ కంట్రోల్ సెంటర్ను ఏర్పాటు చేస్తారు. మానసిక సమస్యలతో ఈ కేంద్రాలకు వచ్చే గర్భిణులకు కాన్పు అయి, పుట్టిన పిల్లలకు ఏడాది వయసు వచ్చే వరకు కౌన్సెలింగ్ ఇవ్వనున్నట్టు తెలిసింది. వ్యాయామాలు, యోగా, ధ్యానం చేయిస్తారు. పిల్లల కోసం ప్రత్యేకంగా ఆటపాటలను రూపొందిస్తున్నారు.