ఆదిలాబాద్: ఆదిలాబాద్ రిమ్స్ (Adilabad RIMS) మెడికల్ కాలేజీ ఆవరణలో బుధవారం అర్ధరాత్రి ఘర్షణ చోటు చేసుకున్నది. క్యాంపస్లోకి బయటి వ్యక్తులు చొరబడి తమపై దాడి చేశారని వైద్య విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఈ సందర్భంగా ఇరువర్గాల మధ్య తోపులాట, ఘర్షణ చోటు చేసుకుందని తెలుస్తున్నది. ఈ క్రమంలో ఇంటర్న్షిప్ చేస్తున్న ఇద్దరు విద్యార్థులు గాయపడ్డారు. దీంతో క్యాంపస్లో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది.
కాగా, క్రాంతి అనే అసిస్టెంట్ ప్రొఫెసర్తోపాటు క్యాంపస్లోకి వచ్చిన బయటి వ్యక్తులే తమపై దాడికి పాల్పడ్డారని జూనియర్ డాక్టర్లు ఆరోపిస్తున్నారు. కాలేజీ హాస్టల్ వద్ద ధర్నాకు దిగారు. వెంటనే అతనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. డాక్టర్ క్రాంతి దిష్టిబొమ్మను దహనం చేశారు. వసీం అనే వ్యక్తితో కలిసి మరో ముగ్గురు దాడికి పాల్పడ్డారని చెప్పారు. అయితే మెయిన్ గేట్ సెక్యూరిటీని లెక్కచేయకుండా దుండగులు క్యాంపస్లోకి వచ్చారని, వారంతా రిమ్స్ డైరెక్టర్ అభిమానులని ఆరోపిస్తున్నారు. అయితే ఎలాంటి అవాంఛనీయ పరిస్థితులు తలెత్తకుండా పోలీసులు భారీగా బలగాలను మోహరించారు. రిమ్స్లోకి చొరబడ్డ వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు సమాచారం.