హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 29 (నమస్తే తెలంగాణ): దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో బీజేపీ పెద్దల పరిస్థితి తేలుకుట్టిన దొంగల్లా తయారైంది. సాధారణ రోజుల్లో రాష్ర్టానికి వచ్చే కేంద్ర మంత్రులు టీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేసేవారు. కానీ, ఇప్పుడు అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. మాదాపూర్ శిల్పకళావేదికలో ఓ కార్యక్రమానికి వచ్చిన కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, పీయూష్ గోయల్ ‘కమల్ ఫైల్స్’ వ్యవహారంపై పూర్తిగా మౌనం దాల్చారు.
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు అంశంపై వారిని మీడియా ప్రతినిధులు ప్రశ్నించినప్పటికీ ఎటువంటి సమాధానం చెప్పకుండానే వాహనం ఎక్కి వెళ్లిపోయారు. కనీసం ‘నో కామెంట్’ లాంటి రొటీన్ వ్యాఖ్యలు కూడా చేయకపోవడం విశేషం. సాధారణంగా కేంద్ర మంత్రులు వస్తే.. రాష్ట్ర బీజేపీ నేతల్లో ఎవరో ఒకరు ఆయా కార్యక్రమాలకు హాజరయ్యేవారు. కానీ శనివారం ఆ ఇద్దరు మంత్రులను కలిసేందుకు రాష్ట్ర బీజేపీ నాయకులు ఎవరూ రాకపోవడం, రాజకీయ హడావిడి చేయకపోవడం గమనార్హం.