హైదరాబాద్, డిసెంబర్ 11 (నమస్తే తెలంగాణ)/తెలుగు యూనివర్సిటీ: తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ మాజీ చైర్మన్ అల్లం నారాయణ జర్నలిస్టులకు దిక్సూచిగా, అండగా నిలిచారని పలువురు వక్తలు ప్రశంసించారు. ఒక విజన్తో ముందుకు సాగిన ఆయన మీడియా రంగానికి వన్నె తెచ్చి ఎందరికో మార్గదర్శిగా నిలిచారని సిబ్బంది, పలువురు జర్నలిస్టులు కొనియాడారు. తొమ్మిదిన్నరేండ్లు జర్నలిస్టుల సంక్షేమమే పరమావధిగా పనిచేసిన అల్లం నారాయణకు మీడియా అకాడమీ కార్యాలయంలో సిబ్బంది సోమవారం ఆత్మీయ వీడ్కోలు పలికారు. పదేండ్లుగా ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకొని సిబ్బంది కన్నీటి పర్యంతమయ్యారు. మనసున్న మా రాజు మా అల్లం సారు.. అంటూ కొనియాడారు. ఆయనకు సోమవారం ఘనంగా వీడ్కోలు పలికారు. తెలంగాణ ప్రభుత్వాన్ని ఒప్పించి రూ.42 కోట్ల సంక్షేమ నిధితో రూ.18 కోట్లను తెలంగాణ జర్నలిస్టుల సంక్షేమం కోసం ఖర్చుపెట్టిన ఏకైక మీడియా అకాడమీ చైర్మన్గా నిలిచారు. ఏడేండ్లులో మరణించిన 500 మంది జర్నలిస్టు కుటుంబాలకు రూ.లక్ష పరిహారం ఇవ్వటమే కాకుండా నేటికీ నెలకు 3,000 చొప్పున పెన్షన్ అందించారు. కరోనాలో సంక్షేమ నిధి నుంచి రూ.7 కోట్లను జర్నలిస్టులకు సత్వర సాయం కింద అందజేశారు. భావి జర్నలిస్టుల శిక్షణకు సహాయపడేలా ఆరు పుస్తకాలను అందుబాటులోకి తెచ్చారు. పది వేల మందిపైగా జర్నలిస్టులకు శిక్షణ తరగతులు నిర్వహించి, ఆ పదవికే వన్నె తెచ్చారు. రూ.15 కోట్లతో మీడియా అకాడమీ భవనాన్ని నిర్మించారు.