హైదరాబాద్, జూలై 25 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర రాజధాని నడిబొడ్డున కార్పొరేట్ కార్యాలయాన్ని తలదన్నేలా మీడియా అకాడమీ సొంత భవనం రూపుదిద్దుకొన్నది. నాంపల్లి చాపెల్రోడ్డులో పాత ప్రెస్ అకాడమీ భవనం స్థానంలో నిర్మించిన కొత్త మీడియా అకాడమీ భవనం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. వెయ్యి గజాల స్థలంలో నాలుగు అంతస్థుల్లో 29,548 చదరపు అడుగుల్లో అద్దాల మేడను నిర్మించారు. ఈ భవనం ప్రారంభోత్సవానికి రావాల్సిందిగా ముఖ్యమంత్రి కే చంద్ర శేఖర్రావుకు మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ విజ్ఞప్తి చేశారు. సీఎం ఆమోదం తెలిపిన వెంటనే ముహూర్తం ఖరారు చేయనున్నారు. పాత అకాడమీ భవనంలో 2015 ఫిబ్రవరిలో జరిగిన అకాడమీ మొదటి సర్వసభ్య సమావేశంలో అకాడమీకి కొత్త భవనం నిర్మించాలని సీఎం కేసీఆర్ సూచించారు. 2017లో భవన నిర్మాణానికి రూ.15 కోట్లు విడుదల చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కర్త, కర్మ, క్రియగా అందమైన భవనం రూపుదిద్దుకొన్నది.
పనులు పరిశీలించిన అకాడమీ చైర్మన్
భవన నిర్మాణం పూర్తి కావచ్చిన సందర్భంగా సమాచార పౌర సంబంధాల శాఖ ప్రత్యేక కమిషనర్ అశోక్రెడ్డి, డైరెక్టర్ రాజమౌళి ఇతర అధికారులతో కలిసి అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ పరిశీలించారు. భవనం పనులన్నీ తుదిదశకు వచ్చినందున మిగిలిన పనులు పూర్తిచేసి మెరుగులుదిద్దాలని ఆర్అండ్బీ అధికారులను కోరారు. సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ, జర్నలిస్టుల పట్ల ఆయనకున్న చిత్తశుద్ధి వల్ల ఇది సాధ్యమైందని పేర్కొన్నారు. భవన నిర్మాణ పనులను పర్యవేక్షించిన సమాచార శాఖ ప్రత్యేక కమిషనర్ అశోక్రెడ్డి ఇంజినీర్లకు పలు సూచనలు చేశారు. త్వరలో మీడియా అకాడమీ భవనాన్ని ముఖ్యమంత్రి చేతులమీదుగా ప్రారంభించుకొంటామని అకాడమీ చైర్మన్ వెల్లడించారు.
భవనం ప్రత్యేకతలు
మీడియా అకాడమీ భవనాన్ని వెయ్యి గజాల స్థలంలో నాలుగు అంతస్థుల్లో 29,548 చదరపు అడుగుల్లో నిర్మించారు. భవనంలో జర్నలిస్టుల కోసం నాలుగు తరగతి గదులు, కార్యాలయ సిబ్బంది కోసం ఒక అంతస్థు కేటాయించారు. రెండంతస్థుల్లో కలిపి 250 మంది కూర్చునే సామర్థ్యం గల ఆడిటోరియం, గ్రంథాలయం, చైర్మన్ తదితరులకు ప్రత్యేక గదులు నిర్మించారు. తరగతి గదుల్లో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఏర్పాటు చేసిన ప్రత్యేక కంప్యూటర్ గదిని కూడా నిర్మించారు. రాష్ట్ర ఆర్అండ్బీ శాఖ ఈ నిర్మాణం పూర్తిచేసింది.