హైదరాబాద్, ఏప్రిల్ 22 (నమస్తే తెలంగాణ): ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం అభివృద్ధి, విస్తరణ పనులపై దృష్టిసారించాలని రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల అభివృద్ధిశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అధికారులను ఆదేశించారు. ధర్మపురి క్షేత్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దాలని చెప్పారు. హైదరాబాద్లోని తన క్యాంపు కార్యాలయంలో ఆలయ అభివృద్ధి పనులపై గురువారం ఆయన అధికారులతో సమీక్షించారు. యాదాద్రి స్ఫూర్తితో ధర్మపురి క్షేత్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దాలని అన్నారు. ఆలయ విస్తరణ, అభివృద్ధి పనుల కోసం రూ.120 కోట్లు కేటాయించారని, అందులో తొలి విడతగా రూ.61.66 కోట్లు విడుదల అయ్యాయని తెలిపారు. జగిత్యాల జిల్లా ధర్మపురిలో పురాతన లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం నెలకొని ఉండటం, ధర్మపురి అసెంబ్లీ నియోజకవర్గానికి తాను ప్రాతినిధ్యం వహిస్తుండటం తన అదృష్టంగా మంత్రి పేర్కొన్నారు.
ఆలయ అభివృద్ధికి సంబంధించిన నమూన, ప్రతిపాదనలు, కార్యాచరణ ప్రణాళిక ఇప్పటిదాకా చేపట్టిన పనులు, చేపట్టాల్సిన పనులపై ఆయన అధికారులకు సూచనలు చేశారు. గోదావరి తీరంలో ధర్మపురి క్షేత్రం ఉండటాన్ని భక్తులు మరింత పవిత్రంగా భావించి వేలాది మంది వచ్చేలా తీర్చిదిద్దాలని ఆయన సూచించారు. దేవస్థానం విస్తరణకు కావలసిన భూసేకరణ, పునఃనిర్మాణానికి సంబంధించి పురాతత్వశాఖల నుంచి అవసరమైన అన్ని అనుమతులు వచ్చేలా ఏర్పాట్లు చేయాలని చెప్పారు. ఈ సమావేశంలో దేవాదాయశాఖ ఈఈ రాజేశ్, ఆలయ ఈవో సంకటాల శ్రీనివాస్, డీఈఈ రఘునందన్, అసిస్టెంట్ స్తపతి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.