అబద్ధం: ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్ పేపర్ వాట్సప్ ద్వారా లీక్ అయ్యింది. పేపర్ లీక్తో ప్రైవేట్ కాలేజీలకు లబ్ధి చేకూరింది. ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం రెగ్యులర్ పరీక్షల్లో సుమారు 45 శాతం మంది ఫెయిల్ అయ్యారు. సప్లిమెంటరీనాటికి వారిలో ఏకంగా 92.5 శాతం పాస్ అయ్యారు.
నిజం: ప్రశ్నాపత్రాలను ఇతర రాష్ర్టాలకు చెందిన నిపుణులు తయారు చేస్తారు. ఎన్క్రిప్టెడ్ ఫైల్ రూపంలో యూనివర్సిటీకి పంపుతారు. ఒక్కో సబ్జెక్ట్కు సంబంధించి సుమారు 50-100 వరకు పేపర్లను సెట్ చేస్తారు. ఆ ఫైల్ను కంట్రోలర్ దగ్గర ఉన్న కంప్యూటర్లో నమోదు చేస్తారు. దానికి కనీసం ఇంటర్నెట్ కనెక్షన్ కూడా ఉండదు. పరీక్ష నిర్వహించే రోజు ఉదయం 9 గంటలకు సంబంధిత సబ్జెక్ట్ బోధించే అధ్యాపకుడిని పిలిపిస్తారు. ఆయన 4- 5 సెట్లు డౌన్లోడ్ చేస్తారు. అందులో ఒక సెట్ను ఎంపిక చేసి పెన్డ్రైవ్లో వేస్తారు. 9.30 గంటలకు ఎన్క్రిప్టెడ్ మెయిల్ రూపంలో ప్రశ్నాపత్రాలను ఆయా కాలేజీలకు పంపుతారు. దాని పాస్వర్డ్ను 9.45 గంటలకు చెప్తారు. వారు 10 గంటల్లోగా.. అంటే పావుగంటలో ఆ ప్రశ్నాపత్రాలను ప్రింట్ తీసి విద్యార్థులకు అందివ్వాల్సి ఉంటుంది.
ఈ క్రమంలో ఎక్కడా పేపర్ లీక్ అయ్యే అవకాశమే లేదు. రెగ్యులర్ పరీక్షల్లో 30 శాతం మంది మాత్రమే ఫెయిల్ అయ్యారు. సప్లిమెంటరీ పరీక్షల్లో 72 శాతం మంది మాత్రమే పాసయ్యారు. మార్చిలో జరిగిన పరీక్షల్లో, సప్లిమెంటరీలో ప్రభుత్వ కాలేజీల విద్యార్థులకే ఎక్కువ మార్కులు వచ్చాయి. క్వశ్చన్ పేపర్ లీక్ అయ్యిందంటూ వస్తున్నదంతా తప్పుడు ప్రచారమేనని కాళోజీ వర్సిటీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ మల్లీశ్వర్ స్పష్టంచేశారు. ఎంబీబీఎస్ ప్రశ్నాపత్రం లీక్ అయ్యిందని అధికారికంగా తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని వీసీ కరుణాకర్రెడ్డి తెలిపారు. ఎవరైనా ఆధారాలతో సహా వచ్చి ఫిర్యాదు చేస్తే విచారణ చేపడుతామన్నారు.