వరంగల్ : రాష్ట్రంలో ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమైంది. ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల ప్రవేశాలకు గానూ ఆన్లైన్ దరఖాస్తుల నమోదుకు కాళోజి నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం సోమవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా యూనివర్సిటీ పరిధిలోని కళాశాలల్లో సీట్లను భర్తీ చేయనున్నారు. జాతీయ స్థాయి అర్హత పరీక్ష నీట్ 2022లో అర్హత సాధించిన అభ్యర్థులు నమోదు చేసుకోవాలని సూచించారు.
అక్టోబర్ 11వ తేదీ ఉదయం 10 గంటల నుండి 18వ తేదీ సాయింత్రం 6 గంటల వరకు అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తుతో పాటు సంబంధిత ధ్రువపత్రాలను స్కాన్ చేసి వెబ్సైట్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్లో సమర్పించిన దరఖాస్తులు, ధ్రువపత్రాలను యూనివర్సిటీ పరిశీలించిన అనంతరం తుది మెరిట్ జాబితాను విడుదల చేస్తారు. ప్రవేశాలకు సంబంధించిన ఇతర సమాచారానికి యూనివర్సిటీ వెబ్సైట్ www.knruhs.telangana.gov.in ను సందర్శించాలని యూనివర్సిటీ వర్గాలు ఒక ప్రకటనలో తెలిపాయి.