వనస్థలిపురం,జూన్ 16: హైదరాబాద్ వనస్థలిపురంలోని పనామా చౌరస్తా వద్ద విడెం సిల్క్స్ అండ్ ఫర్నిచర్ షోరూమ్లో శుక్రవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. రాత్రి 9:30 గంటలకు సిబ్బంది ఆ షోరూమ్ను మూసి వెళ్ళారు. దాని నుంచి 10:30 గంటలకు మంటలు వస్తుండడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో అగ్నిమాపక సిబ్బంది 3 ఫైరింజన్లతో రంగంలోకి దిగి మంటలను ఆర్పివేశారు. అప్పటికే భారీగా ఫర్నిచర్తో పాటు దుస్తులు దగ్ధమయ్యాయి. రూ.6 కోట్ల ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా వేస్తున్నారు. ఈ ప్రమాదంతో విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. విద్యుత్తు సరఫరా చేసే మెయిన్ను పూర్తిగా ఆఫ్చేసి వెళ్లామని, షార్ట్ సర్క్యూట్ జరిగే అవకాశాలు లేవని యాజమాన్యం వెల్లడించింది. ప్రమాద స్థలాన్ని ఎల్బీ నగర్ డీసీపీ సాయిశ్రీ, ఏసీపీ పురుషోత్తంరెడ్డి పరిశీలించారు.