హైదరాబాద్, సెప్టెంబర్ 14 (నమస్తే తెలంగాణ): సీపీఐ మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు సంజయ్ దీపక్రావును తెలంగాణ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. ఆ పార్టీ తమిళనాడు, కేరళ, కర్ణాటక ట్రైజంక్షన్, పశ్చిమ ఘాట్ స్పెషల్ జోన్ కమిటీ కార్యదర్శిగా కూడా కొనసాగుతున్న ఆయన హైదరాబాద్లో చికిత్స పొందుతుండగా పోలీసులు అరెస్టు చేసినట్టు విశ్వసనీయంగా తెలిసింది. కేరళ అడవుల్లో నిర్వహించిన ఆపరేషన్లో దీపక్రావును రాష్ట్ర పోలీసులు అదుపులోకి తీసుకున్నారనే వాదనా వినిపిస్తున్నది. దీనిపై తెలంగాణ పోలీసులు ఎటువంటి ప్రకటన విడుదల చేయలేదు. దీపక్రావు భార్యనూ కర్ణాటకలో అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. కేరళలో ఇతన్ని అనిల్, వికాస్ పేర్లతో పిలుస్తుంటారు. మహారాష్ట్రలోని థానే జిల్లా అంబర్నాథ్కు చెందిన దీపక్రావు గతంలో రెండుసార్లు అరెస్టయ్యాడు. ధూలే, బెంగళూరులోనూ అరెస్టయి జైలుకూ వెళ్లొచ్చాడు. చాలాకాలం మహారాష్ట్రలో పనిచేసిన ఆయన 2019లో పాలకాడ్ ఎన్కౌంటర్లో మావోయిస్టు నేత మణివాసగం మృతి తర్వాత 2020 నుంచి పశ్చిమ ఘాట్ కార్యకలాపాలకు నాయకత్వం వహిస్తున్నాడు.