హైదరాబాద్, డిసెంబర్24(నమస్తే తెలంగాణ): జాతీయ చేనేత దినోత్సవాన్ని సాధించుకున్న తరహాలోనే ప్రపంచ చేనేత దినోత్సవ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వరల్డ్ వీవర్స్ కాన్ఫరెన్స్లో పలువురు వక్తలు పిలుపునిచ్చారు. ఇండోనేషియా దేశంలోని బాలిలో ఫిబ్రవరి 18న జరగనున్న వరల్డ్ వీవర్స్ కాన్ఫరెన్స్పై హైదరాబాద్ కోకాపేటలోని హేమంత్సిరి స్టూడియోలో ఆదివారం అవగాహన సమావేశం జరిగింది.
వరల్డ్ వీవర్స్ కాన్ఫరెన్స్ నిర్వాహకుడు యర్రమాద వెంకన్న నేత అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలువురు వక్తలు మాట్లాడుతూ వరల్డ్ వీవర్స్ కాన్ఫరెన్స్ ప్రాధాన్యాన్ని వివరించారు. మిషన్ వరల్డ్ హ్యాండ్లూమ్ డేకి మద్దతు తెలపాలని, ఆ భావజాలాన్ని మరింత విస్తృతపర్చాలని పిలుపునిచ్చారు. సమావేశంలో టెక్స్టైల్ నేషనల్ అడ్వైజర్ హెచ్కే చారి, యర్రా శ్రీనివాస్రావు, అహింస సిల్ ఇన్వెంటర్ రాజయ్య, సంగీత నృత్యరూపక రచయిత డాక్టర్ వడ్డేపల్లి కృష్ణ, హేమంత్సిరి లేబుల్ వ్యవస్థాపకురాలు శిరీష, లేబుల్ రామ వ్యవస్థాపకురాలు మవూరి రాజేశ్వరి, టెక్స్టైల్ డిజైనర్లు లావణ్య సిస్టాల, రత్న, వీవర్స్ ఆఫ్ ఇండియా డాక్యుమెంటరీ చిత్ర దర్శకులు రాఘవేంద్ర, జెల్ల నరేందర్ తదితరులు పాల్గొన్నారు.