ఫోన్ కోసం ప్రాణం తీసుకుంది
సింధూజ. 15 ఏండ్ల అమ్మాయి. పొద్దస్తమానం ఫోన్తోనే గడిపేది. బిడ్డ పరిస్థితి గమనించిన తల్లిదండ్రులు ఫోన్ తీసేసుకొన్నారు. అది తట్టుకోలేక ఆ అమ్మాయి ఇంట్లోనే ఆత్మహత్య చేసుకున్నది.
మంచి మార్కులు వచ్చాయని ఫోన్ కొనిస్తే..
సోనిక. పదో తరగతిలో 95% మార్కులు సాధించింది. తల్లిదండ్రులు ముచ్చటపడి, స్మార్ట్ఫోన్ కొనిచ్చారు. అంతే. కాలక్షేపం మొదలైంది. ఇంటర్ మొదటి సంవత్సరంలో చదువు మీద ధ్యాస తగ్గింది. ప్రవర్తన మారింది. అమ్మానాన్నను చులకన చేస్తున్నది. వారిని కొట్టడానికి వెళ్తున్నది. తనను ఏమైనా అంటే ఇంటికి రానని బెదిరిస్తున్నది.
ఫోన్ కోసం అమ్మను చంపేశాడు
లక్ష్మి దినసరి కూలి. పొద్దస్తమానం కష్టపడి కొడుకు మహేశ్ను ఇంటర్ వరకు చదివించింది. అతడి స్నేహితులకు సెల్ఫోన్లు ఉన్నాయి. తనకూ కావాలని అమ్మతో గొడవ పడ్డాడు. కోపంతో ఊగిపోయాడు. రోకలిబండ తీసుకొని తలపై బాదాడు. ఆమె చనిపోయింది. ఇది జోగుళాంబ గద్వాల జిల్లాలో ఇటీవల జరిగిన విషాదం.
రోజుకు 300 లాగిన్లు
శశిధర్. పదో తరగతి విద్యార్థి. మొబైల్ ఫోన్ చేతికొచ్చింది. ఫేస్బుక్, యూట్యూబ్, ట్విట్టర్ అకౌంట్లు ఓపెన్ చేశాడు. ఒక్కొక్క యాప్లో ఒక్కొక్క డీపీ పెట్టి, మురిసిపోతుంటాడు. పరిస్థితి చేయిదాటి పోతున్నదని గుర్తించిన తండ్రి సైకియాట్రిస్టు వద్దకు తీసుకెళ్లాడు. అబ్బాయి చెప్పిన మాటలు విని సైకియాట్రిస్టే ఆశ్చర్యపోయాడు. రోజుకు కనీసం 300 సార్లు లాగిన్, లాగ్ ఔట్ అవుతాడట. రోజుకు 14 గంటలు మొబైల్ ఫోన్లోనే గడిపేస్తున్నాడు. చక్కగా చదువుకోవాల్సిన వయస్సులో అంతలా బానిసైపోయాడు.
హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 1 ( నమస్తే తెలంగాణ): ఒకప్పుడు నలుగురు పిల్లలు ఒకచోట చేరితే.. అదొక సందడి. అక్కడొక కోలాహలం. మాటలు, పాటలు, ఆటలు.. పోట్లాటలు.. నవ్వులు విరబూసేవి. మరిప్పుడు.. వంద మంది చేరినా.. అంతా ముభావమే! ఎవరి నోటిలోంచీ ఒక్కమాటైనా రాదు. అందరి కండ్లు తమ అరచేతిలోని స్క్రీన్ వైపే! అందరి ధ్యాస చాటింగ్ల మీదనే! ఎవరి ముఖంలోనూ సంతోషం ఉండదు. పెదవులపై దరహాసం కనిపించదు. కనీసం నలుగురు కలిసి భోజనం చేస్తున్నప్పుడైనా ముచ్చట్లు ఉండవు. ఇది నేటి తరం జీవితాల్లో సెల్ఫోన్ తీసుకొచ్చిన మార్పు. ప్రపంచాన్ని అరచేతిలో ఇమిడ్చిపెట్టిన సెల్ఫోన్.. తన పక్కనే ఉన్న మనిషితో సంభాషించలేని విషమ పరిస్థితిలోకి మనల్ని ఈడ్చుకెళ్లింది.
ఇక టీనేజ్ పిల్లల పరిస్థితి మరీ ఘోరం. ముఖ్యంగా 16-19 ఏండ్ల పిల్లలు స్మార్ట్ఫోన్లకు బానిసలుగా మారుతున్న తీరు కలవరపెడుతున్నది. తల్లిదండ్రులను భయపెడుతున్నది. సైకాలజిస్టులు, సైకియాట్రిస్టులను సైతం నివ్వెరపరుస్తున్నది. సెల్ఫోన్ కొనివ్వలేదన్న కోపంతో కూలి పని చేస్తూ, తనను చదివిస్తున్న అమ్మనే రోకలితో బాదే చంపేశాడు ఒక ఇంటర్మీడియట్ విద్యార్థి. అమ్మానాన్న సెల్ఫోన్ లాక్కున్నారన్న కోపంతో ఆత్మహత్య చేసుకున్నది మరో అమ్మాయి. ఇవి సెల్ఫోన్ మావన జీవితాల్లో, కుటుంబ సంబంధాల్లో సృష్టిస్తున్న విలయానికి కొన్ని ఉదాహరణలు మాత్రమే. హాయిగా ఆడుతూ.. పాడుతూ.. చక్కగా చదువుకొంటూ.. మంచి భవిష్యత్తుకు బాటలు వేసుకోవాల్సిన వయస్సులో చాటింగ్లు, వీడియోగేమ్లకు బానిసలుగా మారుతున్న పరిస్థితి. సెల్ఫోన్లను అతిగా వినియోగిస్తున్నవారు సమయాన్ని వృథా చేసుకోవడమే కాదు ఆరోగ్యాన్ని కూడా నాశనం చేసుకొంటున్నారు.
చికాకు, కోపం, డిప్రెషన్ లాంటి అనేక మానసిక రుగ్మతలకు లోనవుతున్నారు. అర్ధరాత్రి దాకా సెల్ఫోన్లో గడుపుతున్న పిల్లల కంటిచూపు దెబ్బతింటున్నది. నరాల సంబంధ వ్యాధులు చుట్టుముడుతున్నాయి. చివరకు ఆయా పిల్లలను స్మార్ట్ఫోన్ డీ అడిక్షన్ సెంటర్లలో చేర్చాల్సిన దౌర్భాగ్యం దాపురిస్తున్నది. బెంగళూరు, ఢిల్లీ, పుణె, అమృతసర్ లాంటి నగరాలతో పాటు ఉత్తరప్రదేశ్ వంటి రాష్ర్టాల్లో స్మార్ట్ఫోన్ డీ అడిక్షన్ సెంటర్లలో వేల మంది పిల్లలకు చికిత్స అందిస్తున్నారు. సంవత్సరంపాటు ట్రీట్మెంట్ అందించినా కొంతమందిలో పురోగతి లేదని వైద్యులు ఆందోళన వ్యక్తంచేస్తుండటం పరిస్థితి తీవ్రతకు అద్దంపడుతున్నది. చికిత్స పొందుతున్న పేషెంట్లలో 40 శాతం మంది మాత్రమే స్మార్ట్ఫోన్ వ్యసనం నుంచి బయటపడుతున్నట్టు డెలాయిట్ అనే సంస్థ చేసిన అధ్యయనంలో వెల్లడైంది. వివిధ అవసరాల రీత్యా పిల్లలకు స్మార్ట్ఫోన్లు ఇస్తున్న తల్లిదండ్రులు సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే భారీ మూల్యమే చెల్లించుకోవాల్సి వస్తుంది.
పిల్లలు అతిగా సెల్ఫోన్ వాడటం వల్ల కలిగే కొన్ని అనర్ధాలు
డెలాయిట్ సంస్థ అధ్యయనంలో వెల్లడైన అంశాలు
పిల్లలతో ఎక్కువ సమయం గడపాలి
పిల్లలు ఏం చేస్తున్నారు? ఎవరితో మాట్లాడుతున్నారు? అనే అంశంపై తల్లిదండ్రులు కన్నేసి ఉంచాలి. పిల్లలతో ఎక్కువ సమయం గడపాలి. వాళ్లు చెప్పేది వినాలి. 16-19 వయస్సు పిల్లలు అమ్మానాన్నల మాటకు విలువ ఇస్తారు. స్టార్ట్ఫోన్ వినియోగం మితిమీరడంతో వారి ప్రవర్తనలో మార్పులొస్తున్నాయి. పిల్లలకు సెల్ఫోన్ ఎంతవరకు అవసరమో తల్లిదండ్రులకు అవగాహన ఉండాలి.
-డాక్టర్ జీసీ కవిత, కౌన్సెలింగ్ సైకాలజిస్టు
పిల్లల్లో పాజిటివిటీ నింపాలి
స్మార్ట్ఫోన్లకు అడిక్ట్ అయిన పిల్లలను ఒకేసారి ఆ అలవాటు మానాలని ఒత్తిడి చేయొద్దు. అది వారి మానసిక స్థితిని చెడగొడుతుంది. అతిగా ఎందుకు వాడవద్దో నెమ్మదిగా నచ్చజెప్పాలి. తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి పిల్లలకు తగిన గుర్తింపు ఇవ్వాలి. మంచి పనులను మెచ్చుకోవాలి. పాజిటివ్ స్టేట్మెంట్స్ ఎప్పటికీ గుర్తుండిపోతాయి. పాజిటివ్గా ఆలోచించాలనీ, పాజిటివ్ సెల్ఫ్ స్టేట్మెంట్స్ ఇచ్చుకోవాలనీ పిల్లలకు చెప్తూ ఉండాలి.
-నందిత ఆస్తాన, సైకాలజిస్టు
ఇతరులతో పోల్చ వద్దు
16-19 వయస్సు పిల్లలు స్మార్ట్ఫోన్లతో ఎక్కువ సమయం వృథా చేస్తున్నారు. దీనితో చదువులపై ధ్యాస తగ్గుతున్నది. పిల్లల ప్రవర్తనకు తల్లిదండ్రులు కూడా కారణమే. ప్రతిసారీ పిల్లలను విమర్శించడం, తిట్టడం, ఇతరులతో పోల్చడం మంచిది కాదు. దానివల్ల చేటు ఎక్కువగా ఉంటుంది. నలుగురిలో ఉన్నప్పుడు పిల్లలను విమర్శించవద్దు. ఒంటరిగా ఉన్నప్పుడు నచ్చజెప్పడానికి ప్రయత్నించాలి. తల్లిదండ్రులు నెగిటివ్గా మాట్లాడితే పిల్లలు ఆత్మన్యూనతకు
గురవుతారు.
-డాక్టర్ మోతినేని రాంచందర్, తెలంగాణ సైకాలజిస్టుల అసోసియేషన్ అధ్యక్షుడు