చేగుంట, సెప్టెంబర్ 14 : ఆపతిలో ఉండి సాయం కోసం పదిసార్లు ఫోన్ చేస్తే కనీసం ఒక్కసారి కూడా స్పందించలేదని మెదక్ జిల్లా చేగుంట మండలం ఇబ్రహీంపూర్ గ్రామానికి చెందిన పలువురు దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్రావును నిలదీశారు. దుబ్బాక నియోజకవర్గ పరిధిలోకి వచ్చే ఇబ్రహీంపూర్ గ్రామానికి చెందిన లింగన్నగారి శ్రీకాంత్ గతంలో రోడ్డు ప్రమాదంలో గాయపడి హైదరాబాద్ దవాఖానలో చికిత్స తీసుకుంటున్నాడు.
ఇటీవల అతడి ఆరోగ్యం విషమించడంతో ఉప సర్పంచ్ రమేశ్తోపాటు స్థానికులు ఎమ్మెల్యేకు పదిసార్లు ఫోన్చేశారు. కానీ, ఎమ్మెల్యే ఫోన్ లిఫ్ట్ చేయలేదు. శ్రీకాంత్ చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందగా.. మృతదేహాన్ని గ్రామానికి తీసుకొచ్చారు. శవ రాజకీయాల కోసం బుధవారం గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యే రఘునందన్రావును గ్రామస్థులు నిలదీశారు. సచ్చినంక ఎందుకు వచ్చావని మండిపడ్డారు. ‘దుబ్బాక నియోజకవర్గంలో ఏ ఆపతి వచ్చినా నేనున్నాను.
ఒక్క ఫోన్చేస్తే చిటికెలో పనిచేయిస్తా’నని ఎన్నికల ముందు ప్రజలకు హామీ ఇచ్చి.. పదిసార్లు ఫోన్ చేసినా స్పందించక పోవడంపై వారు మండిపడ్డారు. నిలదీస్తున్న దృశ్యాలను సెల్ఫోన్లో తీస్తుండగా, ఎమ్మెల్యేతోపాటు అక్కడ ఉన్న బీజేపీ కార్యకర్తలు ఫొటోలు, వీడియోలు తీయొద్దని బెదిరించారు. గ్రామస్థులు నిలదీయడంతో ఎమ్మెల్యే అక్కడి నుంచి జారుకున్నాడు.