హైదరాబాద్, నవంబర్ 14 (నమస్తే తెలంగాణ) : పర్యావరణాన్ని కూడా ప్రపంచ కార్పొరేట్ సంపన్న దేశాలు వ్యాపారంగా మలుచుకొంటున్నాయని భారత మార్క్సిస్టు కమ్యూనిస్టు పార్టీ (ఎంసీపీఐయు) జాతీయ ప్రధానకార్యదర్శి ఎం అశోక్ మండిపడ్డారు. రానున్నకాలంలో పర్యావరణ పరిక్షణ కోసం యుద్ధాలు జరిగే పరిస్థితులు ఏర్పడవచ్చని ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం బీహార్ రాష్ట్రంలోని ముజఫర్పూర్లో ప్రారంభమైన భారత మార్క్సిస్టు కమ్యూనిస్టు పార్టీ ఐదో జాతీయ మహాసభల్లో ఆయన మాట్లాడుతూ పలు దేశాలు తమ ప్రజల ఆరోగ్యం, విద్య, ఆర్థిక సమతుల్యతను విస్మరించి.. కొద్దిమంది బిలియనీర్లు, సంపన్నవర్గాల ప్రయోజనం కోసం పనిచేస్తున్నాయని ధ్వజమెత్తారు. లాభాలు, దోపిడీ తప్ప.. ప్రజల ఆరోగ్యం, కొనుగోలు శక్తిని పెంచే చర్యలు చేపట్టడం లేదని విమర్శించారు. దేశంలో రాజ్యాంగ వ్యవస్థలను, ధ్వంసం చేసేందుకు కుట్రలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. సామ్రాజ్యవాద కార్పొరేట్, ప్రపంచీకరణ విధానాలకు వ్యతిరేకంగా ప్రజాపోరాటాలకు ఎంసీపీఐ(యూ) నాయకత్వం వహించేందుకు పూనుకోవాలని పిలుపునిచ్చారు. ఈ మహాసభలలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవితో పాటు 14 రాష్ర్టాల నుంచి 400 మంది ప్రతినిధులు పాల్గొన్నారు.