హైదరాబాద్, మే 7 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో శాంతిభద్రతలను పరిరక్షించాల్సిన పోలీస్ శాఖ.. అధికార పక్షానికి కొమ్ముకాస్తున్న వైనంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్పై పోలీసులు చూపుతున్న వైఖరి ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమవుతున్నది. ఆయనను సంగారెడ్డి జైలు నుంచి నిర్మల్ కోర్టుకు తరలించిన తీరు, పోలీసుల అత్యుత్సాహం వెనుక ఉన్న అసలు ఉద్దేశాలను నెటిజన్లు సైతం ప్రశ్నిస్తున్నారు.
నిందితులను లేదా ఖైదీలను ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి తరలించేటప్పుడు ప్రభుత్వ అధికారిక వాహనాలను (పోలీస్ ఎస్కార్ట్ వాహనాలు) వినియోగించడం ప్రాథమిక సూత్రం. కానీ, క్రిశాంక్ను తరలించడానికి ఒక టాటా టియాగో ప్రైవేట్ కారును ఉపయోగించడం వెనుక ఉన్న మర్మమేమిటి? ఆ కారు ఎవరిది? అని ప్రశ్నిస్తున్నది. ప్రభుత్వ రవాణా వ్యవస్థ అందుబాటులో లేనంత దైన్యస్థితిలో పోలీస్ శాఖ ఉన్నదా? గుర్తు తెలియని వ్యక్తుల వాహనాల్లో తరలించడం వల్ల సదరు నిందితుడి ప్రాణాలకు ముప్పు వాటిల్లితే బాధ్యత ఎవరిది? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినంత మాత్రాన అక్రమంగా అరెస్టులు చేయొద్దని కోర్టులు స్పష్టంగా 8 మార్గదర్శకాలను రూపొందించాయి.