Manne Krishank | హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్ సవాల్ విసిరారు. చిత్రపురి సొసైటీలో రూ. 3 వేల కోట్ల భూదందాకు పాల్పడిన అనుముల మహానంద రెడ్డికి తనకు ఏం సంబంధం లేదని రేవంత్ రెడ్డి నిరూపించగలరా..? అని క్రిశాంక్ సవాల్ చేశారు. ఈ భూదందాకు సంబంధించిన పోస్టు పెట్టినందుకు మన్నె క్రిశాంక్పై మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి, ఆయన ఫోన్ను సీజ్ చేశారు.
ఈ సందర్భంగా మన్నె క్రిశాంక్ తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు. చిత్రపురి సొసైటీలో రూ. 3 వేల కోట్ల భూదందా చేసిన అనుముల మహానంద రెడ్డికి, సీఎం రేవంత్ రెడ్డికి సంబంధం ఉందని ఆధారాలు ఉన్నాయి. దమ్ముంటే ఇది తప్పని రేవంత్ రెడ్డి కోర్టుకి వచ్చి నిరూపించగలడా? అని సవాల్ చేశారు. ఆయన ఎవరో మాకు తెలియదు.. ఆయనను అసలు చూడనే చూడలేదు అని వాదిస్తున్నారు. ఆయనతో పరిచయమే లేకపోతే, ఆయనను చూడకపోతే ఈ ఫొటోలు ఎలా వస్తాయి..? రేవంత్ రెడ్డికి చాలెంజ్ చేస్తున్నా.. కోర్టుకు వచ్చి.. ఈ ఫొటో తప్పని నిరూపించగలరా..? సుప్రీంకోర్టు, హైకోర్టు.. ఏ కోర్టుకైనా సరే వెళ్దాం అని క్రిశాంక్ సూచించారు.
మేమే కాదు.. చిత్రపురి సాధన సమితి వారు కూడా ఈ భూదందాపై గతంలో ప్రశ్నించారు. ఈ భూదందాలపై మాజీ గవర్నర్ తమిళిసైకి కూడా చిత్రపురి సాధన సమితి వారు ట్వీట్ చేశారు. రూ. 3 వేల కోట్ల కుంభకోణం జరిగిందని తెలిపారు. చిత్రపురి సిటీపై కేసులు కూడా ఉన్నాయని పేర్కొన్నారు. గతంలో ప్రశ్నించిన వాటిపై మళ్లీ మేం ప్రశ్నించినందుకు మా మీద కేసు నమోదు చేశారు. ఫోన్ను కూడా సీజ్ చేశారు అని మన్నె క్రిశాంక్ పేర్కొన్నారు.