వరంగల్, జనవరి 6 (నమస్తే తెలంగాణప్రతినిధి): వాతావరణ పరిస్థితులు అన్నీ అనుకూలిస్తే.. మామిడి చెట్లు శివరాత్రి వరకే శివలింగమంత సైజులో ఉండే కాయలు కాస్తాయి. అక్టోబర్లోనే మామిడి సీజన్ ప్రారంభమై డిసెంబర్ చివరి నాటికి తోటలు 90 శాతం పూత పూసి మామిడి పంట పిందె దశకు చేరుకుంటుంది. అలాంటిది.. ఈ సారి జనవరి మొదటి వారం దాటినా పూత పూయలేదు. ఫలితంగా తోటల్లోని చెట్లు మొండిగా దర్శనమిస్తున్నాయి. ఇందుకు వాతావరణ మార్పులు, అధికమైన చలి తీవ్రతే కారణమని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే.. ఈ సారి మామిడి పంట దిగుబడులు లేనట్టేనని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అలాగే.. మామిడి పండ్లతో కోట్లల్లో వ్యాపారం నిర్వహించే పండ్ల వ్యాపారులు, మామిడి పండ్లను ఆస్వాదించే ప్రియులు నిరాశ చెందుతున్నారు.
వాతావరణంలో ప్రతికూల మార్పుల కారణంగా ఈ సీజన్లో మామిడి తోటలకు ఇప్పటికీ పూత రాలేదు. చల్లని వాతావరణం, మంచు కురుస్తుండటంతో ఇప్పట్లో పూత వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. డిసెంబర్లోపే పిందెలు పట్టాల్సిన తోటలు.. ఇంకా పూత పట్టకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి ఉన్నది. మామిడి పూసేందుకు జనవరి ఆఖరి వరకు అదును ఉన్నా.. ఆలస్యంగా పూత వస్తే పంట దిగుబడి తగ్గుతుందని రైతులు చెప్తున్నారు. అలాగే.. కాయలు లేటుగా కాసి.. వానకాలం మొదలైన తర్వాత పండు దశకు వస్తాయని, మే నెలలో గాలివానలతో పంట చేతికి రాకుండాపోయే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీన్నిబట్టి ప్రస్తుత సీజన్లో మామిడి తోటల పరిస్థితి ఆశాజనకంగా లేదని రైతులు వాపోతున్నారు. సాధారణంగా డిసెంబర్, జనవరిలో చలి తీవ్రత ఉన్నా.. రాత్రి, పగలు ఉష్ణోగ్రతల మధ్య తేడా ఎక్కువగా ఉంటుంది. రాత్రి బాగా చలి, మధ్యాహ్నం ఎండ ఎక్కువ ఉంటుంది. ప్రస్తుత సీజన్లో రాత్రి తీవ్రమైన చలితోపాటు పగలు కూడా చలి ప్రభావం ఉంటున్నది. వేడి వాతావరణం ఉండటం లేదు. రాత్రి, పగటి ఉష్ణోగ్రతలలో తేడా ఎక్కువగా ఉన్నప్పుడే మామిడి పూతకు అనుకూల వాతావరణం ఉంటుంది. ఇప్పుడు రాత్రి, పగలు చలి వాతావరణం ఎక్కువగా ఉండటంతో మామిడి చెట్లలో పూత ప్రక్రియ కనిపించడం లేదని వ్యవసాయ పరిశోధనా సంస్థ శాస్త్రవేత్తలు వివరిస్తున్నారు.
దేశంలో మామిడి తోటలకు తెలంగాణ ప్రసిద్ధి చెందింది. ఉత్పత్తిలో రాష్ట్రం అగ్రస్థానంలో ఉన్నది. మొత్తం 2.90 లక్షల ఎకరాల్లో మామిడి తోటలు ఉన్నాయి. ఏటా 10.23 లక్షల టన్నుల మామిడి పండ్లు ఉత్పత్తి అవుతాయి. తెలంగాణ మామిడి పండ్లకు ప్రపంచ వ్యాప్తంగా మంచి డిమాండు ఉంది. ఏటా రాష్ట్రంలో మామిడి పండ్లతో రూ.1,535 కోట్ల వ్యాపారం జరుగుతున్నది. దేశ వ్యాప్తంగా ఎక్కువ డిమాండు ఉండే బంగినపల్లి వెరైటీ మామిడి పండ్ల తోటలు తెలంగాణలోనే ఎక్కువగా ఉన్నాయి. ఎగుమతి, రవాణా, నాణ్యతకు అనుకూలమైన వెరైటీ ఇది. అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, దక్షణాఫ్రి కా, కువైట్, ఇరాన్, మస్కట్, చెక్ రిపబ్లిక్, నైజీరియా, మలేషియా, సింగపూర్ దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. దేశంలోని దాదాపు అన్ని రాష్ర్టాలకు తెలంగాణ నుంచి మామిడి పండ్లు ఎగుమతి అవుతాయి. రాష్ట్రంలోని వేలాది మంది రైతులు నేరుగా ఢిల్లీ, ముంబై మార్కెట్లకు పంటను తీసుకుపోయి అమ్ముతారు. వ్యాపారులు కూడా రాష్ట్రంలోని రైతుల నుంచి కొనుగోలు చేసి ఢిల్లీ, ముంబై, నాగ్పూర్, కోల్కతా, చెన్నై, బెంగళూరు మార్కెట్లకు మామిడి పండ్లను ఎగుమతి చేస్తారు.
వాతావరణంలోని మార్పులు అన్ని పంటలపైనా ప్రభావం చూపుతున్నాయి. ప్రస్తుత సీజన్లో మామిడిపై దీని ప్రభావం ఎక్కువగా ఉన్నది. డిసెంబర్ మామిడి పూతకు మంచి సీజన్. రాత్రి, పగలు ఉష్ణోగ్రతలో ఎక్కువగా తేడా ఉన్నప్పుడు మామిడి చెట్లలో అంతర్గతంగా ఒకరకమైన ఒత్తిడి కలిగి పూత ప్రక్రియ వేగంగా జరుగుతుంది. ఈ సారి పగటి ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండటంతో మామిడి పూత రావడం లేదు. జనవరి ఆఖరు వరకు మామిడి పూతకు అనువైన పరిస్థితి ఉంటుంది. మొగ్గలు వచ్చిన చెట్లకు, నేల స్వభావానికి అనుగుణంగా అవసరమైన సస్యరక్షణ చర్యలు చేపట్టాలి.
-రావుల ఉమారెడ్డి, ప్రధాన శాస్త్రవేత్త, వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా కేంద్రం