Mandakrishna Madiga | హైదరాబాద్ : రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీపై ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ మండిపడ్డారు. మాదిగలకు కాంగ్రెస్ పార్టీలో సరైన గుర్తింపు లేదని ధ్వజమెత్తారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మందకృష్ణ మీడియాతో మాట్లాడారు.
వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోనే కాదు.. తెలంగాణ రాష్ట్రం మొత్తం మీదనే ఊరికి ఒక్కరూ కూడా లేని బైండ్ల సామాజిక వర్గానికి చెందిన కడియం శ్రీహరి కూతురు కావ్యకు వరంగల్ ఎంపీ టీకెట్ ఇవ్వడం సరికాదన్నారు. నూటికి 25 శాతం జనాభా ఉన్న మాలలకు, ఊరికి ఒక్కరూ కూడా లేని బైండ్ల సామాజిక వర్గానికి కాంగ్రెస్ పార్టీలో విలువ, గౌరవం, గుర్తింపు ఉంది. కానీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 75 శాతం మాదిగలకు.. మాల, బైండ్ల సామాజిక వర్గాలకు ఉన్నంత విలువ, గౌరవం కాంగ్రెస్ పార్టీలో లేదు. ఎందుకంటే వరంగల్ ఎంపీ టికెట్ కడియం కావ్యకు కేటాయించడంతోనే కాంగ్రెస్ పార్టీ మాదిగలను గుర్తించడం లేదని స్పష్టంగా రుజువైందని మందకృష్ణ మాదిగ పేర్కొన్నారు.