Manda Krishna Madiga | కాంగ్రెస్ ప్రభుత్వంపై తమ యుద్ధం మొదలవుతుందని, ఎస్సీ ఏబీసీడీ వర్గీకరణకు రేవంత్ రెడ్డి సర్కారు కట్టుబడి ఉంటే ఫిబ్రవరి 7వ తేదీకి ముందే నిర్ణయం తీసుకోవాలని ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ పేర్కొన్నారు. వచ్చే నెల ఏడో తేదీ లోపు ఎస్సీ ఏబీసీడీ వర్గీకరణ చేపట్టకుంటే ఫిబ్రవరి ఏడో తేదీన మాదిగల సునామీ హైద్రాబాద్ను తాకుతుందన్నారు. ఆ సునామీలో ఎవరైనా కొట్టుకుపోక తప్పదని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. శుక్రవారం రాత్రి సూర్యాపేట జిల్లా కేంద్రంలోని సుమంగళి ఫంక్షన్ హాల్లో ‘హైద్రాబాద్లో నిర్వహించనున్న లక్ష డప్పులు వేల గొంతుల సన్నాహక సమావేశం’లో ఆయన ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు.
అంతకు ముందు సూర్యాపేట పట్టణంలోని కొత్తబస్టాండ్ వద్ద బాబూ జగ్జీవన్ రామ్ విగ్రహం వద్దకు చేరుకున్న ఆయనకు మాజీ కౌన్సిలర్ వల్దాస్ సౌమ్యాజాని మంగళ హరతితో స్వాగతం పలికారు. అక్కడ నుంచి డప్పు కొడుతూ పట్టణంలోని ప్రధాన వీధుల గుండా భారీ ర్యాలీగా సభా ప్రాంగణానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన నాడే సీఎం రేవంత్ రెడ్డి శాసనసభలో మాట్లాడుతూ తెలంగాణాలో మొదటగా ఎస్సీ వర్గీకరణ చేస్తామని ఇచ్చిన మాటను ఐదు నెలలు అయినా నిలబెట్టుకోలేదన్నారు. అందువల్లే లక్ష డప్పులు, వేల గొంతుల కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగిందన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటే వచ్చే నెల ఏడో తేదీన తమ లక్ష డప్పులు- వేల గొంతుల కార్యక్రమం నిర్వహించే అవసరమే ఉండేది కాదని మందకృష్ణ మాదిగ పేర్కొన్నారు. నిండు శాసనసభలో చెప్పిన మాటను నిలబెట్టుకోలేక పోయాడన్నారు. కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే అమలు చేశారని ఇక్కడ అమలు చేయలేకపోయారని అన్నారు. నోటిఫికేషన్కు ముందే వర్గీకరణ చేస్తామని చెప్పి.. మాల రాజకీయ నాయకులు తెచ్చిన వత్తిడి మేరకు ఎస్సీ వర్గీకరణ చేయకపోవడంతో ఎంతో మంది మాదిగ నిరుద్యోగులు నష్టపోయారన్నారు. ఎస్సీల వర్గీకరణకు అడ్డుతగిలే మాలలకు భవిష్యత్లో పుట్టగతులు లేకుండా చేస్తామని, వారి మాటలు విని వర్గీకరణ చేయకుంటే రేవంత్ సర్కార్ కూడా కుప్పకూలిపోతుందని హెచ్చరించారు. ఏది కావాలో తేల్చుకోవాలని స్పష్టం చేశారు.
మాలలు స్వార్ధపరులని అన్ని రంగాల్లో ఎదిగారని వాళ్ళు ఇంకా తమకు అడ్డం తగిలితే మౌనంగా చూస్తూ ఊరుకోమని మందకృష్ణ మాదిగ తెలిపారు. వారి మాటలకు విలువిచ్చి వర్గీకరణ చేయకుంటే కాంగ్రెస్ ప్రభుత్వంపై తమ యుద్ధం మొదలవుతుందన్నారు. శాంతియుతంగా ప్రదర్శనకు వెళుతున్నామని, వర్గీకరణ అమలు చేస్తే తాము స్వాగతిస్తామని లేని పక్షంలో తమ డప్పులే తమ ఆగ్రహాన్ని తెలియజేస్తాయన్నారు. ప్రతి ఇంటి నుంచి ఒకరు డప్పు వేసుకుని సునామీలా హైద్రాబాద్కు తరలిరావాలని పిలుపునిచ్చారు. వేలాది మంది కళాకారుల గొంతులతో జరిగే సాంస్క్రతిక కార్యక్రమాన్ని మాదిగ బిడ్డలు, అన్ని వర్గాల ప్రజలు, ప్రజాస్వామికవాదులు అందరూ విజయవంతం చేయాలని కోరారు.