బెల్లంపల్లి, ఏప్రిల్ 21 : మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి బీజేపీలో అంతర్గత విభేదాలు భగ్గుమన్నాయి. కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాల ఎదుటే ప్రొటోకాల్ విషయమై వాగ్వాదం జరగడంతో, కార్యకర్తలు విస్తుపోయారు. పట్టణంలోని అశోక్నగర్ బాలాజీ ఫంక్షన్ హాల్లో శుక్రవారం శక్తి కేంద్రం ఇన్చార్జీల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాల, జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ వెరబెల్లి, రాష్ట్ర కార్యదర్శి గంగారెడ్డి, పార్లమెంట్ కోకన్వీనర్ నగునూరి వెంకటేశ్వర్లు గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి మునిమంద రమేశ్ హాజరయ్యారు. సమావేశానికి ముందు స్టేజీ పైకి నియోజకవర్గ నాయకుడు కొయ్యల ఏమాజీని పిలిచారు.
దీంతో పట్టణ అధ్యక్షుడు కోడి రమేశ్ అభ్యంతరం తెలిపాడు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడటమే కాకుండా, ఏ పదవి లేని ఏమాజీని స్టేజీపై ఎందుకు కూర్చోబెట్టారని ప్రశ్నించారు. ప్రొటోకాల్ పాటించడం లేదంటూ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో ఇరువర్గాల నాయకుల నడుమ కొద్దిసేపు ఘర్షణ వాతావరణం నెలకొన్నది. జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ కలుగజేసుకొని రమేశ్ను శాంతింపజేయడానికి ప్రయత్నించినా వినిపించుకోలేదు. చివరకు రమేశ్ అనుచరులు సమావేశాన్ని బహిష్కరించి వెళ్లిపోయారు.