మంచిర్యాల, ఏప్రిల్ 20 (నమస్తే తెలంగాణ): సింగరేణిని నిర్వీర్యం చేసేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేస్తున్న కుట్రలపై కార్మిక లోకం భగ్గుమన్నది. బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణ ప్రయత్నాలపై రగిలిపోతున్న కార్మికులు బుధవారం మందమర్రి ఏరియాలో బీజేపీ నేతల భరతం పట్టారు. బీఎంఎస్ ఆధ్వర్యంలో కేకే 5 గనికి చేరుకొన్న సింగరేణి యాత్రను అడ్డుకొన్నారు. బీజేపీ నేత, మాజీ ఎంపీ వివేక్కు ఝలక్ ఇచ్చారు. ఆయన ప్రసంగాన్ని అడ్డుకొని, బొగ్గు బ్లాకులను వేలం పెట్టి సిగ్గు లేకుండా మీటింగులు పెడుతున్నారా? అని నిలదీశారు.
సింగరేణిని అంబానీ, అదానీలకు కట్టబట్టేందుకు యాత్రలు చేస్తున్నారా? అని ప్రశ్నించారు. సింగరేణి వినాశనాన్ని కోరుకొంటున్న బీజేపీ, దాని తోక యూనియన్ బీఎంఎస్కు ఈ ప్రాంతంలో తిరిగే అర్హతలేదని స్పష్టం చేశారు. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని, లేకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. కార్మికుల ప్రతిఘటనతో కంగుతిన్న వివేక్.. అనుచరులతో అక్కడి నుంచి జారుకొన్నారు.
తెలంగాణ ప్రయోజనాలు దెబ్బతీయాలని చూస్తున్న బీజేపీ నేతలను ప్రజలు ఎక్కడికక్కడ నిలదీయాలి. సింగరేణిని ప్రైవేటుపరం చేయాలని చూస్తున్న బీజేపీకి ఈ ప్రాంతం లో తిరిగే అర్హత లేదు. ఓ వైపు తెలంగాణ బొగ్గు బ్లాక్లను వేలంలో పెట్టి మరోవైపు కార్మికులను మభ్యపెట్టేందుకు దొంగయాత్రలు చేస్తున్నారు. సంస్థపై, కార్మికుల సమస్యలపై కనీస అవగాహన లేకుండా, సిగ్గు లేకుండా మాజీ ఎంపీ వివేక్.. ఈ ప్రాంతంలో తిరుగుతున్నారు. సింగరేణి కార్మికుల కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం, పార్టీ, టీబీజీకేఎస్ దేనికైనా తెగిస్తుంది.
– ప్రభుత్వ విప్ బాల్క సుమన్