Mancherial | మంచిర్యాల, ఫిబ్రవరి 28 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): అదనపు కట్నం కోసం అత్తమామలపై నాటుతుపాకీతో దాడికి యత్నించాడు ఓ అల్లుడు. ఈ ఘటన మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మండలం సాలిగామలో మంగళవారం రాత్రి చోటుచేసుకున్నది. బెల్లంపల్లి మండలం మాలగురిజాలకు చెందిన గోమాస నరేందర్.. సాలిగామకు చెందిన గోలేటి శంకర్ కూతురు బేబీని 2016లో పెండ్లి చేసుకొన్నాడు. కరీంనగర్లో భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి నివాసం ఉంటున్నాడు.
వివాహమైనప్పటి నుంచి నరేందర్ అదనపు కట్నం తీసుకురావాలని, అత్తమామల పేరుపై ఉన్న ఆస్తి రాయించుకోవాలని భార్యను వేధిస్తున్నాడు. ఈ విషయంలోనే గతంలో ఓసారి అత్తమామలపై గొడ్డలితో దాడిచేసేందుకు యత్నించినట్టు సమాచారం. అల్లుడు కావడంతో అప్పుడు పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. తాజాగా.. మంగళవారం భార్యతో గొడవపడిన నరేందర్.. అత్తమామలను హతమార్చేందుకు స్నేహితుడు మహేశ్తో కలిసి సాలిగామకు వచ్చాడు. వెంట తెచ్చుకొన్న చిన్న వెపన్తో రెండు రౌండ్లు కాల్పులు జరిపాడు. అప్పటికే అప్రమత్తమైన అత్తమామలు ఊర్లోకి పరుగెత్తారు. కాగా.. నరేందర్ గన్ను బీహార్ నుంచి సమకూర్చుకొన్నట్టు సమాచారం. ముందు తుపాకీ కొని ఆ తర్వాత బుల్లె ట్లు సమకూర్చుకున్నాడని, గన్తో ఎలా కాల్చాలో తెలియక.. కరీంనగర్ పేపర్ ప్లేట్ల ఫ్యాక్టరీలో తనతో పనిచేసే బీహార్ స్నేహితుల దగ్గర శిక్షణ తీసుకున్నట్టు తెలుస్తున్నది. ఈ ఘటనలో నరేందర్పై కేసు నమోదు చేసి, గాలిస్తున్నామని
ఏసీపీ రవికుమార్ తెలిపారు.