మంత్రి కేటీఆర్ మందులు పంపినా నిలువని ప్రాణాలు
మేడ్చల్ రూరల్, మే 23: బ్లాక్ ఫంగస్తో మేడ్చల్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి మృతి చెందాడు. మంత్రులు కేటీఆర్, మల్లారెడ్డి మందులు సమకూర్చినా ఫలితం లేకుండా పోయింది. గుండ్లపోచంపల్లి వాసి దొడ్ల లక్ష్మీనారాయణ ముదిరాజ్ (47)కు 15 రోజుల క్రితం కరోనా పాజిటివ్ రాగా హోం ఐసొలేషన్లోఉండి చికిత్స పొందాడు. తదుపరి బ్లాక్ ఫంగస్ సోకింది. శుక్రవారం సుచిత్ర ప్రాంతంలోని ప్రైవేట్ ఈఎన్టీ దవాఖానకు తరలించారు. చికిత్సకు కావాల్సిన ఔషధాలకోసం లక్ష్మీనారాయణ సంబంధీకులు మంత్రి మల్లారెడ్డి సహకారంతో మంత్రి కేటీఆర్ను సంప్రదించారు. కేటీఆర్ వెంటనే మందులు పంపించడంతోపాటు కోఠి ఈఎన్టీ దవాఖానలో బెడ్ ఇప్పిస్తామని చెప్పారు. అప్పటికే బాధితుడి పరిస్థితి విషమించింది. దవాఖానకు మార్చే ప్రయత్నంలో ఉండగానే ఆదివారం ఉదయం మృతి చెందాడు.