ఖైరతాబాద్, జూలై 13: మల్టీ నేషనల్ కంపెనీల్లో ఉద్యోగమంటాడు.. లక్షల్లో జీతమంటాడు.. తల్లిదండ్రులు చనిపోయారంటాడు.. నకిలీ పిన్ని, బాబాయిలను సృష్టిస్తాడు.. విడాకులు తీసుకొన్నానంటూ డైవర్సీలను టార్గెట్ చేస్తాడు.. ఒక్కొక్కరి వద్ద ఒక్కో వేరియేషన్.. ఇలా ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా ఏడు పెండ్లిళ్లు చేసుకొన్నాడో నిత్యపెండ్లి కొడుకు. ఇంకా వెలుగులోకి రానివాళ్లు ఎంత మంది ఉన్నారో తెలియదు. ఈ ఘరానా మోసగాడిపై పలు పోలీస్ స్టేషన్లలో కేసులు కూడా నమోదయ్యాయి. అతని చేతిలో మోసపోయిన ఇద్దరు బాధితురాళ్లు మీడియాను ఆశ్రయించారు. తమకు జరిగిన అన్యాయాన్ని బుధవారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో వివరించారు. ఏపీలోని గుంటూరు జిల్లా మంగళగిరి మండలం రామాలయం స్ట్రీట్కు చెందిన అడప శివశంకర్బాబు తమను మోసపూరితంగా పెండ్లి చేసుకొని వంచించాడని వాపోయారు. 2018లో ఓ యువతిని మొదటి వివాహం చేసుకొన్నాడని, బేతపూడిలోనే భార్య, తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నాడని తెలిపారు. ఏడాది కిందట మ్యాట్రిమొని సైట్లో పరిచయమయ్యాడని, ఒకరికి తెలియకుండా మరొకరిని పెండ్లి చేసుకున్నాడని వెల్లడించారు.
కొండాపూర్లోని వేర్వేరు ఇండ్లలో కాపురం పెట్టాడని వివరించారు. తల్లిదండ్రులు చనిపోయారని నకిలీ పిన్నీ, బాబాయిలను చూపించి పెండ్లి చేసుకున్నాడని వాపోయారు. పేరుమోసిన కంపెనీల్లో ఉన్నతోద్యోగినంటూ ఫేక్ ఐడీ, పే స్లిప్పులతో తమను మోసం చేశాడని తెలిపారు. తమ వద్ద రూ.50 లక్షలకు పైగా తీసుకొన్నాడని వివరించారు. అంతేకాకుండా పలువురికి జాబ్ ఆఫర్లు, ఇతర మోసపూరిత వాగ్దానాలు చేసి రూ.లక్షలు తీసుకొన్నాడని చెప్పారు. తాము రామచంద్రాపురం, గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేయగా అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయని అన్నారు. ఇప్పటి వరకు తమతో కలిపి ఏడుగురిని మోసపూరితంగానే పెండ్లి చేసుకొన్నట్టు తెలిసిందని వెల్లడించారు. తాము కూడా ఉన్నతోద్యోగాలు చేస్తున్నామని, పెండ్లి తర్వాత మాన్పించాడని వాపోయారు. డే, నైట్ డ్యూటీల పేరుతో షిఫ్టులవారీగా ఇంటికి వస్తాడని వివరించారు. ఇలాంటి మోసగాడిని కఠినంగా శిక్షించి, మరో ఆడపిల్లకు అన్యాయం జరగకుండా చర్యలు తీసుకోవాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు.
after marriage in