తొగుట, జూలై 25 : ‘మల్లన్నసాగర్ ప్రాజెక్టు ఎంతో అద్భుతంగా ఉందని, మా మహారాష్ట్రలో గోదావరి ప్రవహిస్తున్నా పంట పొలాలకు నీళ్లు రావడం లేదు. కరువు కాటకాలతో రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు.తెలంగాణలో వందల కిలోమీటర్ల దూరానికి గోదావరి నీటిని తీసుకుపోయి సాగునీరందిస్తున్నారు. ఇక్కడ ఎక్కడ చూసినా నిండిన చెరువులు, కుంటలు, వాగులే కనిపిస్తున్నాయి.
సీఎం కేసీఆర్ చొరవతోనే ఇదంతా సాధ్యమైంది’..అని మహారాష్ట్రకు చెందిన ప్రజాప్రతినిధుల బృందం కొనియాడింది. సిద్దిపేట జిల్లా తొగుట మండలం మల్లన్నసాగర్ పంపుహౌస్, కట్టను మంగళవారం మహారాష్ట్ర బృందం పరిశీలించింది. ఎస్సీఈ బస్వారాజ్ మల్లన్నసాగర్ పంప్హౌస్లోని బృందానికి కాళేశ్వరం ప్రాజెక్టు మ్యాప్ను చూపిస్తూ ప్రాజెక్టు విశేషాలను వివరించారు.
మేడిగడ్డ వద్ద మొదలైన ప్రాజెక్టు 10 పంప్హౌస్ల ద్వారా 420 కిలోమీటర్ల ఎత్తు నుంచి వందల కిలోమీటర్ల దూరం నుంచి ఇక్కడికి గోదావరి నీటిని తీసుకువచ్చిన్నట్లు తెలిపారు. మల్లన్నసాగర్ పంపుహౌస్ ద్వారా 1.25లక్షల ఎకరాలకు, కొండపోచమ్మసాగర్ ద్వారా 2.85 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతున్నట్లు తెలిపారు. మేడ్డిగడ్డ వద్ద కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం, బ్యారేజీలు, పంప్హౌస్లు, రిజర్వాయర్లు, కాల్వల నిర్మాణం గురించి మహారాష్ట్ర బృందానికి వివరించారు.
అంత దూరం నుంచి గోదావరి నీళ్లను ఇంత ఎత్తుకు తీసుకువచ్చి నిల్వ చేయడంపై మహారాష్ట్ర ప్రజాప్రతినిధుల బృందం సభ్యులు ఆశ్చర్యానికి గురయ్యారు. అనంతరం ప్రాజెక్ట్ డెలివరీ చానల్ను పరిశీలించారు. మూడున్నర ఎండ్లలో ఇంత పెద్ద ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయడంపై వారు ప్రశంసించారు. కార్యక్రమంలో ఎస్సీ వేణు, డీఈ శ్రీనివాస్ ఉన్నారు.