Prajapalana | బోయినపల్లి, జనవరి 12 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ సర్కారు ఆరు గ్యారెంటీల అమలుకోసం ఆర్భాటంగా తీసుకొన్న ప్రజాపాలన దరఖాస్తులపై అంతులేని నిర్లక్ష్యం కొనసాగుతున్నది. మొన్నటికి మొన్న హైదరాబాద్లో రోడ్లపై అర్జీలను పడేసిన ఘటన మరువకముందే ఇలాంటి సంఘటనే రాజన్నసిరిసిల్ల జిల్లాలో వెలుగులోకి వచ్చింది. బోయినపల్లి మండలం మర్లపేటకు చెందిన దరఖాస్తుల కట్ట మాయంకాగా.. ఈ విషయం ఇద్దరు పంచాయతీ కార్యదర్శుల మధ్య ఘర్షణకు దారితీసింది. పరస్పరం కొట్టుకొని ఠాణా మెట్లెక్కడం కలకలం రేపింది. వివరాల్లోకెళితే, బోయినపల్లి మండలం మర్లపేట కార్యదర్శి రాయినేని లక్ష్మణ్ సెలవుపై వెళ్లగా పక్క గ్రామానికి చెందిన నర్సింగాపూర్ కార్యదర్శి జనగాం శేఖర్కు గ్రామ బాధ్యతలు అప్పగించారు.
ఆయన ఇటీవల జరిగిన ప్రజాపాలనలో మర్లకుంట గ్రామస్తుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. అర్జీలను మండల పరిషత్తులో ఆన్లైన్ చేస్తున్నారు. ఈ బాధ్యతలను మండలాధికారులు పూర్వపు కార్యదర్శి లక్ష్మణ్కు అప్పగించారు. ఆయన గురువారం ఆన్లైన్ చేస్తుండగా ఓ దరఖాస్తు కట్ట కనిపించలేదు. దీంతో ఓ మండలాధికారి సెల్ఫోన్ నుంచి ఇన్చార్జి సెక్రటరీ శేఖర్కు ఫోన్ చేశారు. ‘ఇందుకు నీదే బాధ్యత’ అంటూ దుర్భాషలాడారు. ఈ క్రమంలో శుక్రవారం బోయినపల్లి మండల పరిషత్తులో ఎంపీవో తిలక్ వీరిద్దరితో మాట్లాడుతున్నారు. ఇదే సమయంలో అధికారులు చూస్తుండగానే ఇద్దరు కార్యదర్శులు కొట్లాటకు దిగారు. ఒకరిపై ఒకరు చేయిచేసుకొన్నారు. అనంతరం నేరుగా ఠాణాకు వెళ్లి పరస్పరం ఫిర్యాదు చేసుకొన్నారు. ఈ విషయమై ఎంపీవో తిలక్ను విలేకరులు సంప్రదించగా.. గొడవ జరిగింది నిజమేనని చెప్పారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులకు నివేదిస్తానని పేర్కొన్నారు. పోయిన దరఖాస్తుల కట్ట దొరికిందని చెప్పుకొచ్చారు. అయితే, నిజంగా ఆ దరఖాస్తుల కట్ట దొరికిందా? లేదా ఎంపీవో కావాలని ఆ విధంగా చెప్పారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.