హైదరాబాద్, జనవరి 11 (నమస్తే తెలంగాణ): ఫార్మా, ఐటీ, పారిశ్రామిక రంగాల్లో జాతీయ అంతర్జాతీయ కంపెనీలను ఆకర్షిస్తున్న తెలంగాణ తాజాగా అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలను ఆకట్టుకుంటున్నది. పెట్టుబడుల ఖిల్లాగా మారిన తెలంగాణ విద్యాసుగంధాలు వెదజల్లే విదేశీ విశ్వవిద్యాలయాలను ఆహ్వానిస్తున్నది. ఈ క్రమంలో తెలంగాణలో తొలి విదేశీ వర్సిటీని స్థాపించేందుకు మలేషియన్ యూనివర్సిటీ ముందుకొచ్చింది. ‘లింకన్ యూనివర్సిటీ కాలేజీ’ తెలంగాణలో క్యాంపస్ ఏర్పాటు కోసం యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ)కి దరఖాస్తు చేసుకున్నది. ఇప్పటికే ఆస్ట్రేలియాకు చెందిన డీకిన్, వోలోంగాంగ్ విశ్వవిద్యాలయాలు గుజరాత్లో నెలకొల్పేందుకు ముందుకాగా, మూడో వర్సిటీగా లింకన్ వర్సిటీ కాలేజీ తెలంగాణను ఎంచుకున్నది. లింకన్ వర్సిటీ కాలేజ్ను 2011లో ప్రైవేట్ వర్సిటీగా స్థాపించారు. పైవ్స్టార్ ర్యాంకింగ్ పొందిన ఈ వర్సిటీ టాప్ వర్సిటీల్లో ఒకటిగా ఉన్నది.
గుజరాత్లో రెండు..
ప్రపంచ ప్రమాణాలతో కూడిన విదేశీ వర్సిటీలను దేశంలో నెలకొల్పుతామని కేంద్రం 2022-23 బడ్జెట్లో ప్రకటించింది. విదేశీ వర్సిటీల ఏర్పాటుకు యూజీసీ మార్గదర్శకాలను విడుదల చేసింది. జాతీయ విద్యావిధానం (ఎన్ఈపీ) సిఫార్సులకు అనుగుణంగా విదేశీ విద్యాసంస్థలు భారత్లో ప్రవేశించేందుకు యూజీసీ వీలుకల్పించింది. ఈ మార్గదర్శకాలను అనుసరించి దేశంలో విదేశీ వర్సిటీల ఏర్పాటు నోటిఫికేషన్ జారీచేసి, యూజీసీ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. ప్రత్యేకంగా యూజీసీ పోర్టల్ను తీసుకొచ్చింది.
అంతర్జాతీయ ర్యాకింగ్స్లో టాప్- 500లో గల వర్సిటీలు భారత్లో వర్సిటీలను ఏర్పాటు చేసుకునే వీలుకల్పించగా, వీటిల్లో యూజీ, పీజీ, పీహెచ్డీ, సర్టిఫికెట్, డిప్లొమా కోర్సులను నిర్వహిచేందుకు యూజీసీ అనుమతిచ్చింది. మన దేశంలో ఒకటికి మించి క్యాంపస్ల ఏర్పాటుకు యూజీసీ అవకాశానిచ్చింది. ఆస్ట్రేలియాకు చెందిన రెండు వర్సిటీలు గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ టెక్ సిటీ (గిఫ్ట్ సిటీ)లో ఏర్పాటుకు ముందుకు రాగా, ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్స్ అథారిటీ (ఐఎఫ్ఎస్సీఏ) సూత్రప్రాయంగా అంగీకరించింది. ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, ఫిన్టెక్, సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, గణితం వంటి కోర్సుల నిర్వహణకు ఈ రెండు వర్సిటీలు ముందుకొచ్చాయి.