నల్లగొండ : వచ్చేనెల 15న వరంగల్లో టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న తెలంగాణ విజయగర్జన సభను విజయవంతం చేయాలని శాసనమండలి మాజీ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మిర్యాలగూడ శాసనసభ్యుడు నల్లమోతు భాస్కర్ రావు పిలుపునిచ్చారు. ఈ మేరకు పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు.
మిర్యాలగూడ పట్టణంలోని ఎస్వీ గార్డెన్స్ లో టీఆర్ఎస్ ముఖ్య నేతలు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తల సన్నాహక సమావేశంలో వారు మాట్లాడారు. టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి 20 ఏండ్లు పూర్తయిన సందర్భంగా నిర్వహించనున్న ద్విదశాబ్ది ఉత్సవాలను విజయవంతం చేయాలని కోరారు.
గ్రామ స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు ప్రతి టీఆర్ఎస్ కార్యకర్త తెలంగాణ విజయగర్జన సభకు హాజరు కావాలని సూచించారు. టీఆర్ ఎస్ పార్టీ ఆవిర్భవించిన తేదీ నుంచి సాధించిన విజయాలను, ఎదుర్కొన్న డక్కామొక్కీలను ప్రజలకు వివరించి చైతన్యపర్చాల్సిన బాధ్యత నూతనంగా ఎన్నికైన గ్రామ, మండల,పట్టణ పార్టీ అధ్యక్షులు, కార్యదర్శులు, సభ్యులపై ఉందన్నారు.
గడిచిన ఏడేండ్లలో తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న ప్రజా సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించి చైతన్యపరచాలని కోరారు. నూరేండ్లయినా చెక్కుచెదరని విధంగా టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీ నిర్మాణం చేపట్టారని అన్నారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ మార్గదర్శనాల మేరకు పార్టీ సంస్థాగత నిర్మాణం రానున్న రోజుల్లోనూ మరింత బలోపేతం చేస్తామని అన్నారు.
టీఆర్ఎస్ పార్టీ తమ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటోందని తెలిపారు. టీఆర్ఎస్ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా 9వ సారి కేసీఆర్ ఎన్నికయ్యారని, ఇది చరిత్రాత్మక అంశమని, పార్టీలోని క్రమశిక్షణ, నిబద్ధతకు ఇది నిదర్శనమని వారు చెప్పారు. పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్నవారికి పదవులు ఇచ్చి సముచిత గౌరవం కల్పించామని అన్నారు. అభివృద్ధి, సంక్షేమం టీఆర్ఎస్ సర్కారుకు జోడెడ్ల లాంటివని అన్నారు.
అన్ని రకాల ప్రజా సంక్షేమ పథకాలను రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీగా అమలుచేస్తోందని అన్నారు. అందుకే, ఎన్నికేదైనా గులాబీ జెండా జయకేతనం ఎగురవేస్తోందని అన్నారు. టీఆర్ఎస్ జెండా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు శ్రీరామరక్ష అని అన్నారు.