రవీంద్రభారతి, ఫిబ్రవరి 18 : ఓసీల న్యాయమైన హక్కుల డిమాండ్ల సాధన కోసం ఈ నెల 23న ఓసీ జేఏసీ ఆధ్వర్యంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఉదయం 11గంటలకు నిర్వహించే ‘ఓసీల మహాధర్నా’ను విజయవంతం చేయాలని ఓసీ సామాజిక సంక్షేమ సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు పిలుపునిచ్చారు. ఈ మేరకు బుధవారం బషీర్బాగ్ దేశోద్ధారక భవన్లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ‘చలోఢిల్లీ-ఓసీల మహాధర్నా’ వాల్పోస్టర్ను రాష్ట్ర అధ్యక్షుడు గోపు జైపాల్రెడ్డి, వర్కింగ్ కమిటీ అధ్యక్షుడు తాడిశెట్టి పశుపతితో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రామారావు మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా అగ్రకులాల్లోని పేద విద్యార్థులు, రైతులు, మహిళలకు విద్యా, ఉద్యోగ, ఉపాధి, రాజకీయ రంగాల్లో జరుగుతున్న అన్యాయాన్ని కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లే ఉద్దేశంతో రాజకీయాలకు అతీతంగా ఈ ధర్నా నిర్వహిస్తున్నట్టు స్పష్టంచేశారు.
ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను పటిష్టంగా అమలు చేయాలని, ఓసీ కులాల స్థితిగతుల అధ్యయానికి జాతీయ స్థాయిలో కమిషన్ ఏర్పాటుచేయాలనే డిమాండ్లను ఈ ధర్నా ద్వారా ప్రభుత్వం ముందు ఉంచనున్నట్టు తెలిపారు. ‘ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ల జారీకి షరతుల్లేని 5 ఏండ్ల కాలపరిమితి ఉండాలి. ఈడబ్ల్యూఎస్ అర్హత వార్షిక ఆదాయ పరిమితి రూ.10 లక్షలకు పెంచాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలు ఓసీ నిరుపేదలకు వర్తింపజేయాలి. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను అన్ని రాష్ర్టాల్లో సంపూర్ణంగా అమలుచేయాలి’ అని డిమాండ్ చేశారు. ధర్నాకు పలువురు కేంద్ర, రాష్టర మంత్రులు, ప్రజాప్రతినిధులు హాజరుకానున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో ఓసీ ఐకాస నేతలు చందుపట్ల నరసింహారెడ్డి, అవోపా రాష్ట్ర అధ్యక్షుడు నమశ్శివాయ, న్యాయవాది కట్టంగూరి బుచ్చిరాంరెడ్డి, నిట్టూరి సతీశ్శర్మ తదితరులు పాల్గొన్నారు.