హైదరాబాద్, ఫిబ్రవరి 4 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్లు, కమిషనరేట్లలో నేర పరిశోధనలో అద్భుతమైన పురోగతి సాధించారని, నేరస్థులకు సరైన శిక్షలు పడటంలో పోలీసులు కీలకపాత్ర పోషిస్తున్నారని డీజీపీ అంజనీకుమార్ అభినందించారు. శనివారం యూనిట్ అధికారులు, జోనల్ ఐజీలు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. త్వరలో జరుగనున్న శివరాత్రి పర్వదినానికి రాష్ట్రవ్యాప్తంగా భద్రతాపరమైన ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని ఆదేశాలు ఇచ్చారు. కోర్టు కేసులకు సంబంధించిన అంశాలపై సమీక్షిస్తూ.. ఎట్టిపరిస్థితుల్లోనూ కోర్టు ధికరణ రాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజా జీవనానికి భంగం కలిగించే వారిపై కఠినంగా వ్యవహరించాలని, పీడీ యాక్టుల నమోదు ప్రక్రియలో కోర్టు సూచనలను తప్పకుండా పాటించాలని అన్నారు.
రాష్ట్రంలోని అన్ని కమిషనరేట్లు, ఎస్పీ కార్యాలయాల పరిధిలో పీడీ చట్టం కేసుల నమోదు ఒకే రీతిన ఉండాలని సూచించారు. ముఖ్యంగా విజిటింగ్ వీసాలపై వచ్చే విదేశీయులపై నిఘా ఉంచాలని, అనుమతిలేని సమావేశాల్లో వారు పాల్గొనకుండా చూడాలని స్పష్టం చేశారు. పోలీస్శాఖ బలోపేతానికి రాష్ట్రప్రభుత్వం పెద్ద ఎత్తున పోలీస్ నియామకాలను చేపట్టిన విషయాన్ని ప్రస్తావిస్తూ.. శిక్షణకు పెద్ద సంఖ్యలో వచ్చే ట్రైనీలకు ఇబ్బందులు ఏర్పడకుండా చూడాలని చెప్పారు. తమ పరిధిలోని అన్ని పోలీస్ శిక్షణా కళాశాలలకు వెళ్లి ప్రిన్సిపాళ్లతో సమావేశమై మౌలిక సదుపాయాలపై సమీక్షించాలని కమిషనర్లు, ఎస్సీలకు అంజనీకుమార్ ఆదేశించారు. ముఖ్యంగా రైతు ఆత్మహత్యల నమోదు విషయంలో జాగ్రత్తలు వహించాలని పేరొన్నారు. ఈ సందర్భంగా పీడీ చట్టాల నమోదులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఫంక్షనల్ వర్టికల్స్పై హైకోర్టులో పోలీస్శాఖ జీపీ ముజీబ్ వివరించారు. వీసీలో సీఐడీ చీఫ్ అడిషనల్ డీజీ మహేశ్ భాగవత్, మహిళా భద్రతా విభాగం అడిషనల్ డీజీ శిఖాగోయల్, జోనల్ ఐజీలు చంద్రశేఖర్రెడ్డి, షా నవాజ్ ఖాసీం, జిల్లాల ఎస్పీలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.