హైదరాబాద్, ఆట ప్రతినిధి: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ)లో అవినీతిపై ఏసీబీ నివేదికను సవాలు చేస్తూ హైకోర్టును ఆశ్రయించిన శివలాల్యాదవ్, అర్షద్ ఆయూబ్కు చుక్కెదురైంది. శివలాల్ యాదవ్ వేసిన పిటీషన్ను హైకోర్టు మంగళవారం తోసిపుచ్చింది. 2000-12 మధ్య కాలంలో హెచ్సీఏలో జరిగిన అవినీతిపై విచారణ చేసిన ఏసీబీ అధికారులు రూ. 100 కోట్ల కుంభకోణం జరిగిందని తేల్చారు. మొత్తం 199 అంశాల్లో అవినీతిని ప్రస్తావించిన ఏసీబీ ఈ వ్యవహారంలో శివలాల్, అర్షద్ సహా 27 మంది పాత్ర ఉన్నట్లు గుర్తించి కోర్టుకు నివేదిక సమర్పించారు. విచారణ త్వరగా పూర్తి చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలంటూ ధర్మాసనం ఆదేశించింది. హెచ్సీఏ అక్రమాలపై సాగర్ క్రికెట్ క్లబ్ కార్యదర్శి బాబురావు సాగర్ గతంలో వేసిన పిటీషన్పై స్పందించిన హైకోర్టు ఏసీబీ విచారణకు ఆదేశించిన సంగతి తెలిసిందే.