న్యూఢిల్లీ, అక్టోబర్ 9: దగ్గు, జలుబు సిరప్ల కారణంగా ఆఫ్రికాలోని గాంబియాలో 66 మంది చిన్నారులు మరణించిన నేపథ్యంలో మైడెన్ ఫార్మాస్యూటికల్స్ సభ్యత్వాన్ని రద్దు చేస్తూ భారత ఫార్మా ఎగుమతుల ప్రోత్సాహక సంస్థ కీలక నిర్ణయం తీసుకొన్నది. సంబంధిత ప్రతికూల పరిణామాలపై కంపెనీ నుంచి ఎటువంటి నివేదిక రాలేదని సంస్థ డైరెక్టర్ జనరల్ రవి ఉదయభాస్కర్ తెలిపారు. కాగా, గతంలోనూ మైడెన్ సంస్థ తయారు చేసిన పలు ఔషధాల్లో తప్పిదాలు చోటుచేసుకున్నట్టు తెలిసింది. మెట్ఫార్మిన్ టైప్ 2 డయాబెటిస్ ఔషధంతో పాటు పలు ఉత్పత్తులు నాసిరకంగా ఉన్నాయని కేరళ అధికారులు గతంలో తేల్చారు. మరోవైపు గాంబియాలో మరణించిన చిన్నారుల తల్లులు తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. తమ బిడ్డలను తలచుకొని శోకిస్తున్నారు. చిన్నారుల మరణాల నేపథ్యంలో మెడిసిన్ కంట్రోల్ ఏజెన్సీ, దిగుమతిదారులను గాంబియా పొలీసులు విచారణ చేస్తున్నారు.