బేగంపేట్ జనవరి 23: మహేంద్ర వర్సిటీ, లా ట్రోబ్ వర్సిటీల మధ్య ఒప్పందాలు భారత్, ఆస్ట్రేలియా దేశాల మధ్య విద్యావకాశాలను మరింత పెంపొందిస్తాయని సౌత్ ఏషియా కమర్షియల్, సీనియర్ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ కమిషనర్ డాక్టర్ మోనికా కెన్నెడీ అభిప్రాయపడ్డారు. సివిల్ ఇంజినీరింగ్ విద్య పరిశోధనలను విస్తృతం చేసేందుకు ఆస్ట్రేలియాలోని లా ట్రోబ్ వర్సిటీతో హైదరాబాద్లోని మహేంద్ర వర్సిటీ ఒప్పందం చేసుకొన్నది.
బుధవారం బేగంపేట్లోని తాజ్ వివాంత హోటల్లో జరిగిన ఈ సమావేశంలో రెండు యూనివర్సిటీల ప్రతినిధులు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేసుకొన్నారు. వర్చువల్గా హాజరైన మోనికా కెన్నెడీ మాట్లాడుతూ… భారతదేశం, ఆస్ట్రేలియా మధ్య వ్యూహాత్మక ఒప్పందం ఇరు దేశాల మధ్య విద్య సాంస్కృతిక సంబంధాలను మరింత మెరుగుపరుస్తుందని పేర్కోన్నారు. ముఖ్యంగా పరిశోధనలపై సహకారం బలపడుతుందని తెలిపారు. కార్యక్రమంలో మహేంద్ర వర్సిటీ వీసీ డాక్టర్ యాజులు మేదురి, లాట్రోబ్ వర్సిటీ ఇంజినీరింగ్ విభాగాధిపతి హోస్సోమ్ అబుయెల్ నాగా తదితరులు పాల్గొన్నారు.