మహబూబ్నగర్ : ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణల నేపథ్యంలో మహబూబ్నగర్ రవాణాశాఖ డిప్యూటీ కమిషనర్ (Deputy Tranport Commsioner) కిషన్ నాయక్ నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. మంగళవారం ఉదయం నుంచి హైదరాబాద్ బోయిన్పల్లిలోని ఆర్ఆర్నగర్లోగల ఆయన నివాసంతోపాటు దాదాపు 12 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో అధికారులు భారీగా ఆస్తులను గుర్తించారు.
బహిరంగ మార్కెట్లో ఆ ఆస్తుల విలువ దాదాపు రూ.36 కోట్లకు పైనే ఉంటుందని ఏసీబీ అధికారులు అంచనా వేశారు. పెట్రోల్ బంక్లు, షాపింగ్ కాంప్లెక్స్లు, హోటళ్లు, స్థిర, చరాస్తులతో పాటు, బ్యాంకు లాకర్లలో కిలోన్నర బంగారం గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు ఏసీబీ డీఎస్పీ శ్రీధర్ తెలిపారు. కిషన్ నాయక్ను అరెస్ట్ చేసినట్లు తెలిపారు.
ఏసీబీ అధికారులు 15 బృందాలుకు పైగా ఏర్పడి మహబూబ్నగర్, హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్, నిజామాబాద్లలో సోదాలు నిర్వహించారు. నిజామాబాద్లో లహరి ఇంటర్నేషనల్ హోటల్, రాయల్ ఓక్ బిల్డింగ్ కిషన్ నాయక్కు చెందినవిగా గుర్తించారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.