సుల్తాన్బజార్,జనవరి 27: బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర (బీవోఎం) శాఖల్లో అన్ని క్యాడర్లలోని ఖాళీలను వెంటనే భర్తీ చేసి, పనిభారం తగ్గించాలని యునైటెడ్ ఫోరం ఆఫ్ మహాబ్యాంక్స్ యూనియన్స్ డిమాండ్ చేసింది. దేశవ్యాప్త ధర్నాలో భాగంగా శుక్రవారం హనుమాన్టేక్డీలోని బీవోఎం కార్యాలయం వద్ద బ్యాంకు ఉద్యోగులు నిరసన తెలిపారు. యూనియన్ కన్వీనర్ రేవంత్ కుమార్, కో కన్వీనర్ కే కాంతారావు మాట్ల్లాడుతూ, తప్పనిసరి పరిస్థితుల్లో సమ్మెకు దిగాల్సి వచ్చిందని, బ్యాంక్ ఖాతాదారులు అర్థం చేసుకొని తమకు సహకరించాలని కోరారు. తమ సమస్యలకు పరిష్కారం లభించకపోతే వచ్చే నెల 9,10వ తేదీల్లో ధర్నా నిర్వహిస్తామని, అప్పటికీ స్పందన రాకుంటే మార్చిలో నిరవధిక సమ్మెకు దిగుతామని హెచ్చరించారు.