హైదరాబాద్ : తెలంగాణ వ్యాప్తంగా మహా శివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. శివాలయాలు శివనామస్మరణతో మార్మోగిపోతున్నాయి. శైవక్షేత్రాలన్ని భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజాము నుంచే శివాలయాలకు భక్తులు పోటెత్తారు. శివరాత్రి పర్వదినం సందర్భంగా రుద్రాభిషేకాలు, ప్రత్యేక పూజలు చేస్తున్నారు భక్తులు.
ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని చెర్వుగట్టు, పానగల్ ఛాయాసోమేశ్వరాలయం, పిల్లలమర్రి, వాడపల్లి శివాలయాల్లో భక్తులు బారులు తీరారు. వేకువజాము నుంచే స్వామి వారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని జోగులాంబ బాలబ్రహ్మేశ్వరస్వామి ఆలయంలోనూ భక్తుల సందడి నెలకొంది. తెల్లవారుజాము నుంచే స్వామి వారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తున్నారు. హనుమకొండ వేయి స్తంభాల ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి. భక్తులతో ఆలయం కిటకిటలాడుతోంది. జనగామ జిల్లా పాలకుర్తి సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు.
వేములవాడ రాజన్న ఆలయంలో సాయంత్రం 4 గంటలకు శివదీక్ష స్వాములకు దర్శనం కల్పించనున్నారు. సాయంత్రం 6:05 గంటలకు స్వామి వారి కల్యాణమండపంలో మహాలింగార్చన నిర్వహించనున్నారు. రాత్రి 11:35 గంటలకు లింగోద్భవ సమయంలో మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం నిర్వహించనున్నారు.
కీసరగుట్ట, ఏడుపాయల, బీరంగూడ ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకుంటున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు.