హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 26 (నమస్తే తెలంగాణ): ప్రపంచంలోని వివిధ రంగాలకు చెందిన టాప్ రెండు శాతం శాస్త్రవేత్తలలో ఎల్వీ ప్రసాద్ కంటి దవాఖానకు చెందిన 11 మందికి చోటు దక్కింది. అమెరికాకు చెందిన స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ ఈ జాబితాను రూపొందించింది. ప్రపంచంలోని 22 రంగాలు, 176 ఉప రంగాలకు చెందిన శాస్త్రవేత్తలు ఈ జాబితాలో ఉన్నారు. కంటి వైద్యం కూడా 22 రంగాలలో ఒకటని, నేత్ర పరిశోధకుల జాబితాలో తమ దవాఖానకు చెందిన 11 మందికి చోటు దక్కడం విశేషమని ఎల్వీ ప్రసాద్ వర్గాలు హర్షం వ్యక్తంచేశాయి. ఆ జాబితాలో ఎల్వీ ప్రసాద్ వ్యవస్థాపకుడు డాక్టర్ గుళ్లపల్లి ఎన్ రావు, లాబరేటరీ సర్వీసెస్ మాజీ డైరెక్టర్ సావిత్రి శర్మ, విజిటింగ్ ప్రొఫెసర్ జిల్ కీఫ్, ఎగ్జిక్యూటివ్ చైర్, ప్రొఫెసర్ డాక్టర్ ప్రశాంత్ గార్గ్, సీనియర్ ఆక్యులో ప్లాస్టిక్ క్లినీషియన్ డాక్టర్ మొహ్మద్ జావెద్ అలీ, డాక్టర్ స్వాతి కలికి, డాక్టర్ రోహిత్ ఖన్నా, డాక్టర్ తారాప్రసాద్ దాస్, డాక్టర్ సయాన్ బసు, డాక్టర్ శివాజీ సిసింథి, ప్రొఫెసర్ డీ బాలసుబ్రమణియన్ తదితరులు ఉన్నారు. ఎల్వీపీఐ నుంచి వీరంతా కంటి వైద్యంపై పలు పరిశోధనలు జరిపారు.