హైదరాబాద్, మే 23 (నమస్తే తెలంగాణ): ప్రపంచ ఆర్థిక వేదిక (వరల్డ్ ఎకనమిక్ ఫోరం) సమావేశాల్లో తొలి రోజే తెలంగాణకు భారీగా పెట్టుబడులు దకాయి. స్విట్జర్లాండ్లోని దావోస్లో జరుగుతున్న ఈ సమావేశాల సందర్భంగా రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కే తారకరామారావుతో సోమవారం వివిధ కంపెనీల ప్రతినిధులు సమావేశమై తెలంగాణలో పెట్టుబడులు పెట్టనున్నట్టు తెలిపారు. ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో రూ.500 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్టు లూలు గ్రూపు అధిపతి యూసుఫ్ అలీ ప్రకటించారు. తెలంగాణ నుంచి యూరప్ సహా వివిధ విదేశాలకు ఆహార ఉత్పత్తులను ఎగుమతి చేసేందుకు త్వరలో తమ యూనిట్ను ప్రారంభిస్తామని, దీనిపై కొద్ది రోజుల్లో అధికారిక ప్రకటన చేస్తామని తెలిపారు.
దీంతో ఇందుకు అవసరమైన అనుమతి పత్రాలను మంత్రి కేటీఆర్ ఆయనకు అందజేశారు. తెలంగాణలో కేవలం ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలోనే కాకుండా భారీ కమర్షియల్ కాంప్లెక్స్ల నిర్మాణానికి కూడా లూలు గ్రూపు మరిన్ని పెట్టుబడులను పెట్టనున్నట్టు యూసుఫ్ అలీ తెలిపారు. దీని కోసం ఇప్పటికే హైదరాబాద్లోని పలు ప్రాంతాలను ఎంచుకొని ఆయా ప్రాపర్టీల యజమానులతో మాట్లాడుతున్నామని వివరించారు. హైదరాబాద్లో అంతర్జాతీయ ప్రమాణాలతో అద్భుతమైన షాపింగ్ మాల్ను నిర్మించాలన్నది తమ లక్ష్యమని చెప్పారు.
వ్యవసాయ ఉత్పత్తులకు మరింత డిమాండ్: కేటీఆర్
రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు లూలు గ్రూప్ ముందుకు రావడంపై మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్లో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు ద్వారా రాష్ట్రంలోని వ్యవసాయ ఉత్పత్తులకు, వ్యవసాయ అనుబంధ రంగాల ఉత్పత్తులకు డిమాండ్ ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తున్నదని పేర్కొన్నారు. తెలంగాణలో లూలు గ్రూప్ అంతర్జాతీయ స్థాయి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ను ఏర్పాటు చేయనుండటం స్థానిక వ్యవసాయ ఉత్పత్తులకు డిమాండ్ను మరింత పెంచేందుకు దోహదపడుతుందని అన్నారు. తెలంగాణలో రూ.500 కోట్ల భారీ పెట్టుబడి పెడుతున్న లులూకి ధన్యవాదాలు తెలిపారు.
హైదరాబాద్లో స్విస్రీ కార్యాలయం
స్విట్జర్లాండ్కు చెందిన ప్రముఖ బ్యాంకింగ్, ఫైనా న్స్, బీమా రంగ సంస్థ స్విస్రీ హైదరాబాద్లో తన కార్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించింది. స్విస్రీ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ వెరోనికా సాట్టి, ఎండీ పబ్లిక్ సెక్టార్ సొల్యూషన్స్ ఇవో మెం జింగ్నర్ సోమవారం దావోస్లో మంత్రి కేటీఆర్తో సమావేశమై ఈ విషయాన్ని వెల్లడించారు. తెలంగాణలోని నైపుణ్యం గల మానవ వనరులను దృష్టిలో ఉంచుకొని హైదరాబాద్లో తమ కార్యాలయాన్ని ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు.
తొలుత 250 మంది ఉద్యోగులతో కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తామని, ఆ తర్వాత దశలవారీగా ఉద్యోగుల సంఖ్యను పెంచుతామని చెప్పారు. ఈ కార్యాలయం ద్వారా డాటా, డిజిటల్ విభాగాలను బలోపేతం చేయడంతోపాటు ఇన్సూరెన్స్ ఉత్పత్తులను రూపొందించడం, రిస్ మేనేజ్మెంట్ లాంటి అంశాలపై పని చేస్తామని వివరించారు. తమ సంస్థకు అవసరమైన ఇన్నోవేషన్, ఇతర అంశాలకు సంబంధించి టీహబ్తో భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేసుకొనేందుకు సిద్ధంగా ఉన్నట్టు వెల్లడించారు.
రెండో యూనిట్ ఏర్పాటుకు కీమో ఫార్మా రెడీ
స్పెయిన్కు చెందిన బహుళజాతి సంస్థ కీమో ఫార్మా హైదరాబాద్లో రూ.100 కోట్లతో తమ కార్యకలాపాలను విస్తరించనున్నట్టు వెల్లడించింది. ఆ సంస్థ డైరెక్టర్ జీన్ దావోస్లో మంత్రి కేటీఆర్తో సమావేశమై ఈ ప్రకటన చేశారు. ఇప్పటికే హైదరాబాద్లో ఒక యూనిట్ ద్వారా కార్యకలాపాలను నిర్వహిస్తున్న కీమో ఫార్మా.. త్వరలో మరో యూనిట్ను ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నదని తెలిపారు. 2018లో జీనోమ్ వ్యాలీలో తమ కంపెనీ క్వాలిటీ కంట్రోల్, స్టెబిలిటీ ల్యాబ్స్ విభాగాల్లో కార్యకలాపాలను ప్రారంభించిందని, రెండో యూనిట్ ద్వారా వాణిజ్య కార్యకలాపాలను ప్రారంభించనున్నదని వివరించారు.
ఇప్పటికే హైదరాబాద్లో రూ.170 కోట్లు పెట్టుబడి పెట్టామని, 270 మంది ఉద్యోగులతో కార్యకలాపాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. కొత్తగా పెట్టే రూ.100 కోట్ల పెట్టుబడితో హైదరాబాద్లో యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్, పరిశోధన, అభివృద్ధి కేంద్రాన్ని ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా తమకు 10 దేశాల్లో తయారీ యూనిట్లు ఉన్నాయని, వీటిలో హైదరాబాద్ యూనిట్ అద్భుతంగా అభివృద్ధి చెందుతున్నదని జీన్ పేర్కొన్నారు.
ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం: కేటీఆర్
తెలంగాణలో పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చిన కీమో ఫార్మా గ్రూపునకు మంత్రి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. హైదరాబాద్లో లైఫ్ సైన్సెస్ రంగం అభివృద్ధి చెందుతున్న తీరు, భవిష్యత్తు అవకాశాల గురించి ఆ కంపెనీ ప్రతినిధులకు వివరించారు. ఇప్పటికే లైఫ్ సైన్సెస్ రాజధానిగా అభివృద్ధి చెందిన హైదరాబాద్లో మున్ముందు మరిన్ని అవకాశాలు ఉంటాయని తెలిపారు. హైదరాబాద్లో కార్యకలాపాలు విస్తరిస్తున్న కీమో ఫార్మా సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తి సహాయ సహకారాలను అందిస్తామని హామీ ఇచ్చారు.
ద్వితీయ శ్రేణి నగరాల్లో మీషో సేవలు
భారత్లో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ-కామర్స్ సంస్థ ‘మీషో’ హైదరాబాద్లో తన కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించింది. తెలంగాణలోని ద్వితీయ శ్రేణి నగరాల వ్యాపారులు ఆన్లైన్ ద్వారా విక్రయాలు సాగించేందుకు ఈ కేంద్రం తోడ్పడుతుందని మీషో ప్రతినిధులు దావోస్లో మంత్రి కేటీఆర్కు తెలిపారు.
దావోస్-2022కు శుభారంభం ;జెరోధా, మీషో సీఈవోలతో భేటీపై మంత్రి కేటీఆర్
డబ్ల్యూఈఎఫ్ (వరల్డ్ ఎకనమిక్ ఫోరం) సదస్సులో పాల్గొనేందుకు స్విట్జర్లాండ్లోని దావోస్కు వెళ్లిన మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఆదివారం రాత్రి భారత్కు చెందిన జెరోధా, మీషో వ్యవస్థాపకులతో భేటీ అయ్యారు. ‘స్టార్టప్ ప్రపంచంలో ఇద్దరు తెలివైన యువ విజేతలైన జెరోధా కంపెనీ కో-ఫౌండర్ నిఖిల్ కామత్, మీషో సీఈవో విదిత్ అత్రేతో ఆదివారం రాత్రి డిన్నర్లో ఆసక్తికరమైన చర్చలు జరిపాను. దావోస్-2022కు ఇది శుభారంభం’ అని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.
బ్యాంకింగ్, బీమా రంగాలకు తెలంగాణ అనుకూలం: కేటీఆర్
బీమా రంగంలో 160 సంవత్సరాల నుంచి కొనసాగుతున్న దిగ్గజ సంస్థ స్విస్రీ హైదరాబాద్లో తన కార్యాలయాన్ని ఏర్పాటు చేయనుండటంపై మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఆ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ వేరోనికాకు ధన్యవాదాలు తెలిపారు. బ్యాంకింగ్, ఫైనాన్స్, ఇన్సూరెన్స్ రంగానికి చెందిన అనేక కంపెనీలు ఇప్పటికే హైదరాబాద్లో పనిచేస్తున్నాయని అన్నారు. ఈ రంగానికి అవసరమైన సానుకూల వ్యవస్థ హైదరాబాద్లో ఉన్నదని చెప్పారు. దేశీయ బీమా రంగ నియంత్రణ సంస్థ ఐఆర్డీఏ (ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ) సైతం హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్నదని గుర్తు చేశారు. ఇదేవిధంగా స్విస్రీ కూడా హైదరాబాద్ నుంచి తన కార్యకలాపాలను విస్తరిస్తుందని ఆశిస్తున్నట్టు తెలిపారు.