హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా మద్యం దుకాణాలకు లక్కీ డ్రా (Liquor Shop Tenders) కొనసాగుతున్నది. 2023-25 ఎక్సైజ్ పాలసీకి సంబంధించి 2620 మద్యం దుకాణాల కేటాయింపునకు అధికారులు లక్కీ డ్రా నిర్వహిస్తున్నారు. ఉదయం 11 గంటలకు లాటరీ పద్ధతిన (Lucky draw) అర్హులను ఎంపిక ప్రక్రియ ప్రారంభమైంది. మండలాలు, దుకాణాల ప్రాతిపదికగా డ్రా తీస్తున్నారు. ఎంపికైనవారి పేర్లను వెంటనే ప్రకటిస్తున్నారు. దీనికోసం రాష్ట్రవ్యాప్తంగా 34 ఎక్సైజ్ జిల్లాల్లో ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఎంపికైనవారు ఈ నెల 23లోగా నిర్ణీత వార్షిక లైసెన్స్ రుసుంలో ఆరో వంతు చెల్లించాల్సి ఉంటుంది. లైసెన్సుదారులు డిసెంబర్ 1 నుంచి కొత్త దుకాణాల్లో అమ్మకాలకు అనుమతిస్తారు.
కాగా, రాష్ట్రంలోని 2,620 షాపులకు 1,31,490 దరఖాస్తులు వచ్చాయి. హైదరాబాద్, సికింద్రాబాద్, మేడ్చల్, మల్కాజిగిరి, సరూర్నగర్, శంషాబాద్ ఎక్సైజ్ జిల్లాల్లోనే 42,596 దరఖాస్తులు వచ్చాయి. ఇక్కడ గతంలో 18,091 అప్లికేషన్లు మాత్రమే వచ్చాయి. ఇందులో అత్యధికంగా సరూర్నగర్లో 134 మద్యం దుకాణాలకుగాను 10,908 దరఖాస్తులు, శంషాబాద్లో 100 షాపులకు 10,811 అప్లికేషన్లు వచ్చాయి. ఇక నల్లగొండలో 155 దుకాణాలకు 7,058, ఖమ్మంలో 122 షాపులకు 7,027, మేడ్చల్లో 114 దుకాణాలకు 7,017, మల్కాజిగిరి, కొత్తగూడెంలో 88 చొప్పున దుకాణాలు ఉండగా 6,722 దరఖాస్తులు, 5,057 అప్లికేషన్లు వచ్చాయి.