హైదరాబాద్, మే 13 (నమస్తే తెలంగాణ) : నైరుతి రుతుపవనాలు ఈ నెల 16నాటికి దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ సముద్రం, అండమాన్ నికోబార్ దీవుల ప్రాంతంలో ప్రవేశించే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం బుధవారం తీవ్ర అల్పపీడనంగా మారిందని పేర్కొన్నది. గురువారం నుంచి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీలు పెరిగే అవకాశం ఉన్నదని వెల్లడించింది. ఈనెల 22 వరకు భానుడు తన ప్రతాపాన్ని చూపుతాడని హెచ్చరించింది.
గడిచిన 24 గంటల్లో నిజామాబాద్లో అత్యధికంగా 44.5 డిగ్రీలు, జగిత్యాల జిల్లా బీర్పూర్లో 44.4, కామారెడ్డి జిల్లా బిచ్కుందలో 44.2, సిద్దిపేట జిల్లా కోహెడలో 43.9, నిర్మల్ జిల్లా దస్తూరాబాద్లో 43.8 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైనట్టు వివరించింది. వచ్చే రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా వడగాల్పులు ఎక్కువగా ఉంటా యని 11 గంటల తర్వాత బయటకు వెళ్లే సమయాల్లో తగిన జాగ్రత్తలు తీ సుకోవాలని సూచించింది. చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణులు ఈ వారంపాటు జాగ్రత్తగా ఉండాలని కోరింది.